సత్తుపల్లి రూరల్, మార్చి 4 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, అధికారులు నిబద్ధతతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఎంఆర్ గార్డెన్స్లో జరిగిన నియోజకవర్గస్థాయి అధికారుల సమీక్షా సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజా అవసరాలను గుర్తించి.. వాటిని పరిష్కరించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన 82 రోజుల్లోనే హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో నాలుగింటిని నెరవేర్చామని, మరికొద్ది రోజుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు.
అధికారులు ఏ విషయంలోనైనా అవినీతికి పాల్పడితే నిర్మొహమాటంగా విధుల నుంచి తొలగిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని, పైరవీకారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 25వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మెగా డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ధరణిలో ఉన్న సమస్యలను గుర్తించి.. కమిటీ ద్వారా పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. సత్తుపల్లి తన సొంత నియోజకవర్గం అయినందున పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి అర్హులందరికీ ఇస్తామన్నారు.
సింగరేణి బ్లాస్టింగ్ వల్ల నష్టపోయిన బాధితులను ఆ సంస్థే ఆదుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించి ప్రజల్లో భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధికారులు కృషి చేయాన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మంచినీటి కొరత లేకుండా చూడాలన్నారు. సాగర్పై ఉన్న లిఫ్టులను పునరుద్ధరించి రైతులకు ఉపయోగపడేలా చూడాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేలా అధికారులు చూడాలన్నారు.
అనంతరం అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి నివేదికలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎఫ్వో సిదార్థ విక్రమ్సింగ్, ఏసీపీ అనిశెట్టి రఘు, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, డాక్టర్ మట్టా దయానంద్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.