ఖమ్మం, ఆగస్టు 11: ‘రక్షాబంధన్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపడానికే వచ్చా..’ అంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన మహిళలతో రక్షాబంధన్ సందర్భంగా గురువారం ఆయన వీడియో కాల్లో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం.. మహిళలకు ఎంతో ప్రాధాన్యమిచ్చిందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. కాగా, ఈ వీడియో కాల్లో ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నుంచి మహిళలు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తాతా మధు.. జిల్లాకు చెందిన మహిళా లబ్ధిదారులను మంత్రి కేటీఆర్కు పరిచయం చేశారు. వీరందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందాయని, వీరెంతో ఎంతో సంతోషంగా ఉన్నారని, మీకు కూడా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారని అన్నారు. అనంతరం ఆయా లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఖమర్, వైవీ ప్రసాద్, వీరన్న, పోట్ల శ్రీను, పోగుల శ్రీను, కొప్పుల ఆంజనేయులు, శేషు తదితరులు పాల్గొన్నారు.