సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 29 : సత్తుపల్లి ప్రాంత క్రీడాకారుల కల నేటితో నెరవేరనున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం సత్తుపల్లికి విచ్చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఇండోర్ స్టేడియంతోపాటు రూ.90 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేటీఆర్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. రూ.5కోట్లతో ఇండోర్ స్టేడియం, రూ.2 కోట్లతో అంబేద్కర్ ఆడిటోరియం, రూ.4కోట్లతో షాదీఖానాకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. మరో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో వేంసూరు రోడ్డు విస్తరణతోపాటు సెంట్రల్ లైటింగ్, చాకలి ఐలమ్మ ఆడిటోరియం, క్రిస్టియన్ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్తో తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుంటే.. ఐటీ మంత్రి కేటీఆర్ అనేక ఐటీ కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. అలాగే సత్తుపల్లిలో నర్సింగ్ కళాశాలను మంజూరు చేశారని చెప్పారు.
బహిరంగ సభకు తరలిరండి..
సత్తుపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు రూ.1000 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ సత్తుపల్లిలో శనివారం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. సభకు నియోజకవర్గ పరిధిలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులతోపాటు వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు, కేటీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సభ కాకర్లపల్లి రోడ్లోని చంద్ర గార్డెన్స్లో సాయంత్రం 4 గంటలకు జరగనున్నదని ఎమ్మెల్యే చెప్పా రు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూ రు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మ చైర్మన్ వనమా వాసు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఆత్మ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకమరాజు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, అద్దంకి అనిల్ పాల్గొన్నారు.