అశ్వారావుపేట, నవంబర్ 19 : కాంగ్రెస్ హస్తం.. దారిద్రానికి నేస్తమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. 2014 తర్వాత తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్కే ఓటు వేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ఆదివారం అశ్వారావుపేటకు వచ్చిన ఆయన పట్టణంలో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆయా పార్టీలు తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పుకుంటాయని, అప్పటికే అధికారంలో ఉన్న పార్టీలైతే అప్పటికే తాము ఏం చేశాయో, మరోసారి గెలిస్తే ఇంకేం చేయబోతామో చెప్పుకుంటాయని అన్నారు. కానీ కొన్ని పార్టీలు మాత్రం డబ్బులతో మనలను కొనేందుకు వస్తున్నాయని అన్నారు. ఆ పార్టీలన్నీ ధనాన్ని నమ్ముకుంటే.. బీఆర్ఎస్ మాత్రం జనాన్ని నమ్ముకుందని స్పఫ్టం చేశారు.
రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ మూడోసారి ఏర్పాటు కాబోతున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో సన్నబియ్యం అందిస్తామని, రైతుబీమా తరహాలోనే ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల బీమాను వర్తింపజేస్తామని అన్నారు. డిసెంబర్ 3 తర్వాత రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసైన్డ్ భూములున్న ప్రతి రైతుకూ ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని అన్నారు. అలాగే, పామాయిల్ రైతులకు కూడా కనీస మద్దతు ధర ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ విధానం కొత్త సీసాలో పాత సారా లాంటిదేనని, కొత్తదనం ఏమీ లేదని ఎద్దేవా చేశారు. 2014కు ముందు కనీసం కరెంట్ లేక, నీళ్లు లేక ఎలా అల్లాడిపోయామో, ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఎంతలా పడిగాపులు కాశారో ప్రజలందరికీ గుర్తేనని అన్నారు. అందుకని మరో అవకాశమంటూ అడుగుతున్న కాంగ్రెస్ను నమ్మవద్దని సూచించారు. గడచిన 55 ఏళ్లలో 11 సార్లు ప్రజలు కాంగ్రెస్కు అవకాశమిచ్చినా ప్రజలకు ఆ పార్టీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు కరెంట్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పాలనంతా కాలిపోయిన మోటర్ల, పేలిపోయిన ట్రాన్సఫార్మర్లు, అర్ధరాత్రి ఆగమమైన రైతుల బతుకులేనని దుయ్యబట్టారు. మూడు గంటల విద్యుత్ చాలని, 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని కాంగ్రెసోళ్లు ఉచిత సలహాలిస్తుండడం వారి అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు.
పామాయిల్ సాగు విస్తరణతో ఫ్యాక్టరీల సామర్థ్యం కూడా పెంచుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యాన నర్సరీలకు కూడా ఉచితంగా విద్యుత్ అందిస్తామన్నారు. ప్రజలందరూ ఓటు వేసేటప్పుడు పని చేసిన ప్రభుత్వాన్ని, పని చేసే పార్టీని చూడాలని కోరారు. ఒకరికి కత్తి ఇచ్చి మరొకరిని యుద్ధం చేయమంటే ప్రయోజనం ఉండదని అన్నారు. ఈ కత్తిని ‘మెచ్చా’కు ఇచ్చి ఆయననే యుద్ధం చేయమంటేనే తగిన ఫలితం ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే మెచ్చా చేసిన అభివృద్ధి ఇక్కడి ప్రజల కళ్ల ముందే కనిపిస్తోందని అన్నారు. అందుకని మరోసారి కూడా ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్దే హవా అని, హ్యాట్రిక్ సాధించేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ది సోషల్ మీడియాలో కేవలం బిల్డప్ మాత్రమేనని దుయ్యబట్టారు. అనంతరం అశ్వారావుపేట మేజర్ పంచాయతీ పాలకవర్గ సభ్యుడు లక్ష్మణరావు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆదరించాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అన్నారు. అశ్వారావుపేటలో బీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్కు బహుమతిగా అందించాలని కోరారు.
అశ్వారావుపేట నియోజకవర్గంపై మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. అశ్వారావుపేట పట్టణాన్ని డిసెంబర్ 3 తర్వాత ఏర్పాటు కాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీని చేస్తానని ప్రకటించారు. అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం, దమ్మపేట మండలం పట్వారీగూడెం గ్రామాలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. దమ్మపేట 10 బెడ్ల ఆసుపత్రిని 30 బెడ్ల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మంజూరు చేస్తామని మాట ఇచ్చారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఉప్పల వెంకటరమణ, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రావు జోగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, చిన్నంశెట్టి వరలక్ష్మి, సున్నం నాగమణి, జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, బానోతు పద్మావతి, భూక్యా ప్రసాదరావు, వగ్గెల పూజ, డీకేఎం మహిపాల్, కోటగిరి సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు.