ఖమ్మం, డిసెంబర్ 25: ‘అందరినీ ప్రేమించాలి, శాంతిమార్గంలో నడవాలి, పేవాభావంతో మెలగాలి’ అనే క్రీస్తు బోధనలు సర్వమానవాళికీ ఆచరణీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఖమ్మం చర్చికాంపౌం సీఎస్ఐ చర్చిలో ఆదివారం జరిగిన స్రత్యేక ప్రార్థనలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమాభిమానాన్ని, సేవాతత్పరతను, క్షమాగుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొనే పండుగ క్రిస్మస్ మాత్రమేని వివరించారు. క్రిస్మస్ పండుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం దేశంలో ఎక్కడా లేదని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందని గుర్తుచేశారు.
ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పేద కైస్తవులకు ప్రభుత్వ కానుకగా దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. క్రైస్తవులందరూ కుటుంబ సమేతంగా ఆనందంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినం సందర్బంగా దాదాపు 2.85 లక్షల మంది క్రైస్తవులకు కానుకలు పంపించి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని వివరించారు. క్రైస్తవులందరూ సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలవాలని కోరారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, చర్చి సెక్రటరీ సుధాకర్, కార్పొరేటర్లు బీజీ క్లెమెంట్, పల్లా రోజ్లీనా, కమిటీ సభ్యులు కిశోర్, పల్లా రాజశేఖర్, తోకల ప్రవీణ్, పల్లా కిశోర్, దేవదానం, లింగాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపాలెం, డిసెంబర్ 25: ఏసూక్రీస్తు అందరికీ ప్రభువని దైవజనులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా మండలంలోని అన్ని చర్చీల్లోనూ ఆదివారం వేడుకలు జరిగాయి. ఆయా ఉత్సవాల్లో వారు మాట్లాడుతూ.. మానవతా విలువలు ప్రేమ, సహనం, కరుణ వంటి వాటిని మనుషులందరికీ బోధించి ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో నడిచేందుకు క్రీస్తు ఎంతగానో తాపత్రాయపడ్డారని వివరించారు. ఆయన చూపిన మార్గంలో ప్రజలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
క్రీస్తు జన్మదినం యావత్ ప్రపంచానికి పండుగ రోజు అని అన్నారు. చింతగుర్తిలో సర్పంచ్ మెంటెం రామారావు, ఎంపీటీసీ మాళోతు లక్ష్మి, మధురానగర్లో కార్పొరేటర్ కూరాకుల వలరాజు, మంచుకొండలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు మంద సంజీవరావు, మంద తిమోతి, కోయచలకలో ఎంపీటీసీ బలుసుపాటి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ కేక్లు కట్ చేశారు. క్రీస్తు విశ్వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.