ఉమ్మడి జిల్లాలో జోరుగా అభివృద్ధి పనులు
ప్రగతి పనుల్లో పాల్గొంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
నగరంలో మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన
ఖమ్మం, జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పల్లె, పట్టణ ప్రగతి నిర్వహణతో గ్రామాల, పట్టణాలు, నగరా ల రూపురేఖలు మారుతున్నాయి. పల్లెలు అభివృద్ధికి పట్టుకొమ్మలుగా, పట్టణాలు అభివృద్ధికి ఆనవాళ్లుగా మా రాయి. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. నగరంలో పట్టణ ప్రగతిపై దృష్టిసారించిన మంత్రి ప్రగతి పనుల తీరును పరిశీలిస్తూ.. ప్రజల సమస్యలపై ఆరా తీస్తున్నారు. ప్రజలు విన్నవించే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు సూచనలిస్తున్నారు.
సైకిళ్లపై పర్యటిస్తూ.. : కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, మేయర్ పునుకొల్లు నీరజతో సైకిళ్లపై పర్యటించి డివిజన్లలో పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. మంగళవారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పలు డివిజన్లలో పర్యటించి డ్రైనేజీలను శుభ్రం చేయించారు. డ్రైయిన్లు నిండినచోట ఆయనే స్వయంగా పారపట్టి డ్రైన్లను శుభ్రం చేశారు. నగరంలోని ప్రధాన రహదార్లపై డివైడర్లను పరిశీలించడంతోపాటు వాటికి రంగులు వేశారు. నగరంలోని 58వ డివిజన్ వివేకానంద కాలనీలో యంత్రం ద్వారా మురుగును తొలగించే పనులను ప్రారంభించారు. 58వ డివిజన్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రధాన కాలువ పూడిక పనులు ప్రారంభించారు. 6వ డివిజన్ ఖానాపురం ప్రధాన రహదారిపై డివైడర్కు పెయింటింగ్ వేయడంతోపాటు ఖాళీ స్థలాలను శుభ్రం చేయాలని ఆదేశించారు. రఘునాథపాలెం మండలం వాంకుడోతుతండా, రాంక్యాతండా గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. నగరంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్కు శంకుస్థాపన చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన షటిల్, వాలీబాల్, టెన్నికాయిట్ కోర్టులను పోలీసు కమిషనర్ విష్ణు వారియర్తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి
జిల్లా అదనపు కలెక్టర్ మొగిలి స్నేహలత తల్లాడ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మధిర మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీచైర్మన్ కమల్రాజు పర్యటించారు. ఎంపీ నామా వైరా, ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో రాములునాయక్తో కలిసి పర్యటించారు. ఏన్కూరు మండలం నాచారంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే రాములునాయక్ ప్రారంభించారు. నూకలంపాడులో రూ.16లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని వారు ప్రారంభించారు. కూసుమంచి మండలం పెరికసింగారంలో పల్లెప్రగతిలో ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దమ్మపేట, అశ్వారావుపేట, చండ్రుగొండ మండలాల్లో పర్యటించి పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖమ్మం కలెక్టర్ వీపీగౌతమ్ తిరుమలాయపాలెంలో పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దుమ్ముగూడెం మండలంలోని పెద్దనల్లబల్లిలో భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య బృహత్ పల్లెప్రకృతివనం పరిశీలించారు.