ఖమ్మం, ఆగస్టు 22: బీఆర్ఎస్ కార్యకర్తలకు జన్మతాః రుణపడి ఉంటానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. వారి కృషి, కష్టం, నిజాయితీ వల్లనే తాను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగానని గుర్తుచేసుకున్నారు. గులాబీ జెండా మెడలో ఉంటే ఎంతో ధైర్యం వస్తుందని, ఈ జెండానే రాష్ర్టాన్ని సాధించి పెట్టిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మనమీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లోనూ గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మనలో లీడర్, క్యాడర్ అనే తేడా లేదని, మనమంతా ఒకే కుటుంబమని అన్నారు. తన మరోసారి సీటు ఇచ్చిన సీఎం కేసీఆర్కు, మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన పార్టీ ఖమ్మం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలంటే తనకు ఎంతో గౌరవమని, తన ఇంటి శుభకార్యాన్ని కూడా వారు తమ సొంత శుభకార్యంగా శుభప్రదం చేశారని గుర్తుచేశారు. తన ఉన్న ఒక అన్న చనిపోయాడని, కానీ సీఎం కేసీఆర్ మీ అందరితో కలిపి తనకు చాలా పెద్ద కుంటుంబాన్ని ఇచ్చాడని అన్నారు. 2018 ఎన్నికల్లో ఎన్ని పార్టీలూ ఏకమైనా కార్యకర్తలు శ్రమకోర్చి పనిచేసి తనను గొప్ప విజయాన్ని అందించారని గుర్తుచేశారు. తాను గెలిచిన 7 నెలలకే సీఎం కేసీఆర్ తనకు మంత్రిగా అవకాశమిచ్చారని, దాంతో రూ.వందల కోట్ల నిధులతో ఖమ్మాన్ని అద్బుతంగా తీర్చిదిద్దానని అన్నారు. ఎన్నికలకు సరిగ్గా 100 రోజుల సమయమే ఉన్నందున కార్యకర్తలు మైక్రోలెవల్ మేనేజ్మెంట్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, ఆర్జేసీ కృష్ణ, ఫాతిమా, ప్రియాంక, కర్నాటి కృష్ణ, రోజ్లీనా, రుద్రగాని శ్రీదేవి, రావూరి కరుణ, మక్బుల్, కొత్తపల్లి నీరజ, షకీనా, లక్ష్మణ్నాయక్, బత్తుల మురళీప్రసాద్, గుత్తా రవి, వీరూనాయక్, హరిప్రసాద్, అష్రిఫ్, ఇషాక్, పాల్వంచ కృష్ణ, మద్దినేని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.