భధ్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ):గర్భం దాల్చిన మహిళకు సరైన పోషకాలు అందినప్పుడే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తల్లి కడుపులో ఉన్న ప్రతి బిడ్డా ఆరోగ్యవంతంగా జన్మించాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. కేసీఆర్ కిట్ తరహాలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే ఈ పథకం పండంటి బిడ్డ కోసం పోషకాల కిట్టులా ఉపకరిస్తుందని అన్నారు. భద్రాద్రి జిల్లా రామవరంలోని మాతాశిశుఆరోగ్య కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలో రాష్ట్రవైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వర్చువల్గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ.. మాతాశిశువుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉన్నదో ఇప్పుడు కళ్లారా చూస్తున్నామని అన్నారు. గర్భిణులను రక్తహీనత నుంచి కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. మహిళ గర్భిణిగా ఉన్నప్పుడు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బాలింతగా ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ అందిస్తున్న అద్భుత పథకాలు తెలంగాణలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ కిట్లు గర్భిణులకు, బాలింతలకు వరం లాంటివని అన్నారు. భద్రాద్రి జిల్లాలో ఎనీమియా లోపం ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైనందున కొత్తగూడెంలో తొలి విడతగా దాదాపు 16 వేల కిట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలో ఎనీమియా ప్రభావం ఎక్కువగా ఉందని, వాటిలో భద్రాద్రి జిల్లా కూడా ఉందని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.25 లక్షల మంది గర్భిణులకు ప్రభుత్వం ఈ కిట్లను అందజేస్తోందని, వీటి కోసం రూ.50 కోట్లు వెచ్చిస్తోందని అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తల్లీబిడ్డ సంరక్షణను బీఆర్ఎస్ ప్రభుత్వం తన బాధ్యతగా భావిస్తోందని, అందుకే ఇలాంటి పథకాలు అమలు చేస్తోందని అన్నారు. గర్భిణులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ గర్భిణులందరూ ఈ కిట్లను తీసుకొని వాటిల్లో ఉన్న పదార్థాలను స్వీకరించాలని సూచించారు. ఈ పదార్థాలను ఇంట్లోని ఇతర పిల్లలకు, పెద్దలకు పెట్టవద్దని సూచించారు. ఎనీమియా లోపం ప్రసవ సమయంలో గర్భిణికి చాలా ఇబ్బందికరమని అన్నారు. ప్రధానంగా శిశుమరణాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లను అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. అనంతరం ఏఎన్ఎంలకు చీరెలను కూడా పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు, ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ కుమారస్వామి, డీఎంహెచ్వో డాక్టర్ శిరీష, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, డీడబ్ల్యూవో వరలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, సర్పంచ్ మోతి, దిశ కమిటీ సభ్యుడు పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.