ఖమ్మం, నవంబర్ 29: తెలంగాణ రాత మార్చిన విధాత కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భవిస్తేనే ఇక్కడి ప్రజల గోస తీరుతుందని, రాత మారుతుందని నమ్మిన ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో..’ అంటూ 2009 నవంబర్ 29న తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కేసీఆర్ దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన దీక్షా దివస్ను ఘనంగా జరుపుకోవడమంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటినట్లని అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష ప్రారంభించిన కేసీఆర్ పట్టువదలతో తెలంగాణను సాధించారని గుర్తుచేశారు. అదే పట్టుదలతో తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దారని వివరించారు. అన్ని రంగాల్లో అగ్రస్థానాల్లో నిలిపి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. తెలంగాణ ఆచరిస్తున్న విధానాలను దేశంలోని అనేక రాష్ర్టాలు అనుసరిస్తున్నాయంటే ఆ ఘనత ముమ్మాటికీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతి తెలంగాణ పౌరుడూ గర్వపడాలని సూచించారు. ఇలాంటి నాయకుడు తెలంగాణలో జన్మించడం, మనకు పాలకుడిగా లభించడం తెలంగాణ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు దీక్షాదివస్ నిర్వహించారు. ఖమ్మం నగరంలోని మంత్రి అజయ్కుమార్ క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన ధీరోదాత్తుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆయన నాయకత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలువాలని కోరారు. ఉద్యమకారులైన డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, వెంకటరమణ తదితరులను శాలువాలతో సత్కరించారు. టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, కర్నాటి కృష్ణ, తన్నీరు శోభారాణి,, షకీనా, లింగాల రవికుమార్, కొల్లు పద్మ., జక్కుల లక్ష్మయ్య, షేక్ మక్బుల్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాధకుడు కేసీఆర్ అని ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. దీక్షాదివస్ సందర్భంగా పాల్వంచ, అశ్వారావుపేటల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు, తెలంగాణతల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యమనాయకుడిగా కేసీఆర్ దీక్షాదివస్ చేపట్టి తెలంగాణ కలకు జీవం పోసి 13 ఏళ్లు అవుతోందని గుర్తుచేశారు.