పినపాక, నవంబర్ 26: బతుకుదెరువు కోసం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడి అడవుల్లో నివసిస్తున్న వలస ఆదివాసీలు అప్రమత్తంగా ఉండాలని, సంఘ విద్రోహులకు ఆశ్రయం కల్పించొద్దని భద్రాద్రి ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని జానంపేట హైస్కూల్ ఆవరణలో శనివారం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులో ఆయన మాట్లాడారు. వలస ఆదివాసీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.
సమాజానికి నష్టం కలిగించే వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయం కల్పించవద్దని సూచించారు. అలాంటి వారికి సహాయ సహకారాలు అందిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లాలోని పోడుభూముల సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని అన్నారు. వలస ఆదివాసీలు పోడుభూముల విషయంలో అధికారులపై దాడులకు పాల్పడవద్దని సూచించారు. ఏవైనా జబ్బులు వస్తే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని, మూఢనమ్మకాల జోలికి వెళ్లవద్దని సూచించారు.
ఇంతటి మారుమూల గ్రామంలో మణుగూరు సబ్ డివిజన్ పోలీసులు ఇంత పెద్ద ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు నుంచి వచ్చిన ప్రముఖ వైద్యులు సుమారు 2 వేల మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. హైస్కూల్ విద్యార్థులకు సోలార్ లైట్లు పంపిణీ చేశారు. పోలీసు అధికారులు సాయిమనోహర్, రాఘవేందర్రావు, బూర రాజగోపాల్, ముత్యం రమేశ్, శ్రీనివాస్, టీవీఆర్ సూరి, జీవన్రాజు, సర్పంచ్ బాడిశ మహేశ్, వైద్యులు నాగరాజు, జయశ్రీ, శశిధర్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.