కూసుమంచి, జూలై 7: ఆ పాఠశాల అంటే అందరికీ ఇష్టం. ఎంతోమంది ప్రముఖులు చదువుకున్న సర్కారు బడి అది. ఉన్నతోద్యోగాల్లో, రాజకీయాల్లో, పెద్దపెద్ద హోదాల్లో ఎందరినో తీర్చిదిద్దిన ఘనత దాని సొంతం. మాజీ డీజీపీ ముదిరెడ్డి మహేందర్రెడ్డితోపాటు వందలాది మందిని అత్యుత్తములుగా నిలిపిన ప్రాముఖ్యత కలిగిన పాఠశాల అది. అదే.. కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఉత్తీర్ణత, విద్యార్థుల సంఖ్య వంటి అంశాల్లో నాలుగేళ్లుగా అది జిల్లాలో మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటికే 350 మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకొని జిల్లాలో రికార్డు సృష్టించారు. ఇంకా 100 మంది వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ‘మన ఊరు-మన బడి’తో మరిన్ని సౌకర్యాలు సమకూరడంతో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నుతోంది. క్రమశిక్షణ సహా మరెన్నో ప్రత్యేకతలున్న కూసు‘మంచి’ హైస్కూల్పై ఓ కథనం.
ఎందరో ప్రముఖులను అందించిన కూసుమంచి ఉన్నత పాఠశాల ఇప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో జూలై 6 నాటికి 350 విద్యార్థులను కొత్తగా చేర్చుకున్న ఈ పాఠశాల జిల్లాలో అత్యధికంగా అడ్మిషన్లు అందిస్తున్న, అత్యధిక మంది విద్యార్థులున్న ఘనతను సాధించింది. ప్రవేశాల్లోనూ, ఉత్తీర్ణతలోనూ నాలుగేళ్లుగా ఈ రికార్డులను నెలకొల్పుతూనే ఉంది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాల నేటికీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఇక్కడ విద్యనభ్యసించిన వారు విద్యావంతులుగా, రాజకీయ నాయకులుగా, వైద్యులుగా, శాస్త్రవేత్తలుగా, ఉద్యోగులుగా, అనేక రంగాల్లో నిపుణులుగా ఉన్నారు. ఇంకొంతమంది పదవీ విరమణ కూడా పొందారు.
‘మన బడి’తో మారిన రూపురేఖలు..
కూసుమంచి ఉన్నత పాఠశాల నిర్మాణానికి రూ.కోట్ల విలువైన భూములను స్వర్గీయ రంగుభట్ల అప్పయ్య, రామసహాయం రామకృష్ణారెడ్డి, ఖాజామొయినుద్దీన్ అందజేశారు. గతంలో పాఠశాల ఆటస్థలంగా ఉన్న ప్రదేశాన్ని ఇప్పుడు ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దారు. అరకొర వసతులతో ఉన్న ఈ పాఠశాల రూపురేఖలు తెలంగాణ సిద్ధించాక పూర్తిగా మారిపోయాయి. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా అధునాతనంగా తీర్చిదిద్దారు. సుమారు 40 గదులు నిర్మించారు. మౌలిక వసతులు కల్పించారు. కాంపౌండ్ వాల్, ప్రత్యేక మరుగుదొడ్ల సముదాయం, కిచన్ షెడ్, డైనింగ్హాల్, డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో గడిచిన నాలుగేళ్లుగా ఈ పాఠశాల విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధిస్తూనే ఉన్నారు. ఇక్కడి సమీకృత బాలుర వసతి గృహంలో ఖమ్మం జిల్లాతోపాటు నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో ప్రేయర్ జరుగుతుంటే చిన్నపాటి సభను తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ప్రతీ క్లాస్లో 150 మందికి తగ్గకుండా నాలుగు సెక్షన్లతో కొనసాగుతున్న ఈ పాఠశాల.. ఎన్ని ప్రైవేట్ స్కూళ్లు వచ్చినా తన స్థానాన్ని పదిల పరుచుకుంటోంది.
450 వరకు కొత్త అడ్మిషన్లు వస్తాయి..
నిరుడు టెన్త్ విద్యార్థులు వెళ్లాక కూడా 600 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకూ కొత్తగా 350 మంది జాయిన్ అయ్యారు. ఆగస్టు 30 వరకు అడ్మిషన్ల గడువు ఉన్నందున మరో 100 అడ్మిషన్లు వచ్చే అవకాశం ఉంది. ‘మన బడి’ కార్యక్రమంలో మరిన్ని మౌలిక వసతులు సమకూరాయి. విద్యార్థులకు ఇక్కడ మెరుగైన విద్యాబోధన లభిస్తోంది. దీంతో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
–రేలా విక్రమ్రెడ్డి, హెచ్ఎం
ఆశ్రమ పాఠశాల నుంచి వచ్చా..
మాది కూసుమంచి మండలం భగత్వీడు. వల్లభి ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుకున్నా. ఇక్కడ స్టడీ బాగుందని తెలిసి వెంటనే వచ్చి జాయిన్ అయ్యాను. మంచి పాఠశాల కావడంతో గురుకులంలో సీటు వదులుకొని మరీ వచ్చాను. ఇక్కడ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ ఈ పాఠశాలలో చదువుకుంటున్నా. అందరూ చెబుతున్నట్లుగానే ఇక్కడ స్టడీ చాలా బాగుంది.
–భూక్యా దీపిక, పదో తరగతి, భగత్వీడు
ఎంతమంది వచ్చినా చేర్చుకుంటాం..
జిల్లాలోని అన్ని పాఠశాలలకంటే మా పాఠశాల్లో అన్ని విభాగాల్లోనూ ముందుంది. ముఖ్యంగా జిల్లాలోనే అత్యధిక అడ్మిషన్లు మా పాఠశాలలోనే జరుగుతుంటాయి. ఇంకా ఎంతమంది విద్యార్థులొచ్చినా చేర్చుకుంటాం. చదవడంలో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మెరుగైన శిక్షణతో వారిని తీర్చిదిద్దుతాం.
– రవి, ఇంగ్లిష్ టీచర్
మా పాపను ఈ పాఠశాలలోనే చేర్పించా..
మా పాప పేరు కీర్తన. బీసీ గురుకులంలో 7వ తరగతి చదువుకుంది. అయితే కూసుమంచి పాఠశాలల స్టడీ బాగా ఉండడంతో మా ఊరి పిల్లలందరూ ఈ పాఠశాలకే వస్తున్నారు. వారు చెప్పినట్లుగానే టీచర్లుగా మంచిగా బోధిస్తున్నారు. దీంతో మా పాపను కూడా గురుకులం నుంచి తీసుకొచ్చి కూసుమంచి పాఠశాలలో 8వ తరగతిలో జాయిన్ చేశాను.
–ప్రసాద్, పేరెంట్, ముత్యాలగూడెం