బూర్గంపహాడ్, జనవరి 25: వ్యాన్లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు ఛేజ్ చేసి నిందితులను పట్టుకున్న ఘటన బూర్గంపహాడ్ మండలం మోరంపల్లిబంజర్ పంచాయతీ జింకలగూడెం సమీపంలో చోటుచేసుకున్నది. పాల్వంచ డీఎస్పీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మోరంపల్లిబంజర ఫారెస్టు చెక్పోస్టు వద్ద బుధవారం ఎస్సై సంతోశ్ పోలీస్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో భద్రాచలం వైపు నుంచి వస్తున్న వ్యానును ఆపే ప్రయత్నం చేశారు. వ్యాన్ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు పోలీస్ వాహనంతో వెంబడించారు.
జింకలగూడెం వంతెన వద్ద వాహనాన్ని అడ్డుకుని సోదాలు నిర్వహించారు. వ్యాన్లో భారీగా గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వ్యాన్తో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులను మహారాష్ట్రలోని గోవర్థన్వాడీకి చెందిన మహదేవ్ మోహన్ (డ్రైవర్), థేర్కు చెందిన కిషన్ కాళిదాస్ పవార్గా గుర్తించారు. రవాణాతో ప్రమేయం ఉన్న మరో మగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. పట్టుబడిన గంజాయి 2.65 క్వింటాళ్లు ఉంటుందని, దాని విలువ రూ.53.15 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో పాల్వంచ సీఐ నాగరాజు, ఎస్సై సంతోశ్, సిబ్బంది ఉన్నారు.