2014కు ముందు ప్రభుత్వ దవాఖానలు అంటేనే హడలిపోయిన ప్రజలు నేడు అవే ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సర్కార్ ఆసుపత్రులపై అంతలా నమ్మకం పెరిగింది. స్వరాష్ట్రం వచ్చాక తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేయడంతో దవాఖానలు పేదలకు వరంగా మారాయి. నయా పైసా లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందిస్తున్నారు. అధునాతన పరికరాలు సమకూర్చి అత్యాధునిక ఆపరేషన్లు సైతం చేస్తున్నారు.
గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక వైద్యసేవలతోపాటు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నారు. డయాలసిస్ సెంటర్లు కిడ్నీ రోగులకు అపర సంజీవనిగా మారాయి. నాడు మెరుగైన వైద్యం కోసం ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి దూరప్రాంత పట్టణాలకెళ్లేవారు. నేడు ఏరియా ఆసుపత్రుల్లోనే పూర్తిస్థాయి వైద్యసేవలు అందుతున్నాయి. ఇందుకు నిదర్శనమే మణుగూరు 100 పడకల ఏరియా ఆసుపత్రి. గతంలో 30 నుంచి 40కే పరిమితమైన ఔట్ పేషెంట్(ఓపీ) సంఖ్య ప్రస్తుతం 700లకు పైగా వెళ్లిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మారుమూల ఏజెన్సీలో సైతం 24 గంటల వైద్యసేవలు అందుతుండడంతో ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సారపాక, జూలై 4 : సర్కార్ దవాఖానలు పేదలకు అపర సంజీవనిగా మారాయి. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో అంతంతమాత్రంగా వైద్యసేవలు అందడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం, హైదరాబాద్, కొత్తగూడెం వంటి పట్టణాలకు వెళ్లేవారు. పేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయల వ్యయాన్ని భరించలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో స్వరాష్ర్టాన్ని తెచ్చుకున్నాక ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీఠ వేసి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడం, కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందిస్తుండడంతో ప్రభుత్వ దవాఖానలు పేదలకు వరంగా మారాయి.
మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో అన్నిరకాల శస్త్రచికిత్సలు చేస్తుండడంతో ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 30 నుంచి 40 మాత్రమే ఉన్న ఓపీ నేడు 500 నుంచి 700 వరకు పెరిగిందంటే ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు ఎంత నమ్మకం కలిగిందో అర్థం చేసుకోవచ్చు. స్వరాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తుండడంతో సర్కారు దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు అందుతున్నది. దీనికితోడు పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తూ రోగుల మన్ననలు పొందుతున్నారు.
అందుబాటులో అత్యాధునిక పరికరాలు…
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో మణుగూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి కోట్లు ఖర్చుచేసి అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చింది. గతంలో 30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని 100 పడకలుగా అప్గ్రేడ్ చేసి పూర్తిస్థాయిలో వైద్యులను కేటాయించింది. అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చి మహిళలకు అవసరమైన అన్నిరకాల ఆపరేషన్లను చేస్తున్నారు. మరోపక్క రోజువారీ ప్రసవాలతో మహిళలు పెద్దఎత్తున ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ కిట్లు పొందుతూ 102 వాహనం ద్వారా సంతోషంగా ఇళ్లకు చేరడంతో దవాఖానలో సైతం ప్రసవాల సంఖ్య పెరిగింది. దీంతోపాటు అన్నిరోజుల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు అందిస్తూ 24గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉండి తల్లీబిడ్డల సంరక్షణ, గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు, సాధారణ కాన్పులు, ప్రసవానంతరం వాహన సదుపాయం, క్షయ, కుష్టు వ్యాధి నివారణ తదితర వైద్యసేవలు చేపడుతూ రోగులకు వైద్యోనారాయణులుగా మారుతున్నారు.
ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు…
మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో ప్రభుత్వం ఇటీవల కిడ్నీ రోగులకు బాసటగా ఉండేందుకు 5 పడకల ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తాజాగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా ప్రారంభించారు. దీనికితోడు 24గంటలు వైద్యులు అందుబాటులో ఉండి నిరంతరం సేవలందిస్తున్నారు. ఆసుపత్రిలో ఇద్దరు ప్రసూతి వైద్యులు, ఇద్దరు మత్తు వైద్యులు, చెవి, ముక్కు, గొంతు వైద్యుడు, జనరల్ సర్జన్, దంత వైద్యుడు, ఎముకలు, కీళ్ల వ్యాధి నిపుణులతోపాటు ఇతర వైద్యులు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందిస్తున్నారు. గర్భసంచి ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, పాయిజన్ కేసులు, పాముకాటు కేసులతోపాటు గర్భిణులకు ప్రసవాలు చేస్తూ రోగులకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. త్వరలో ఈఎన్టీ విభాగం ద్వారా గొంతు ఆపరేషన్లు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
పేదల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం మణుగూరులో 100 పడకల దవాఖాన ఏర్పాటు చేయడంతో పారిశ్రామిక పట్టణంగా ఎదుగుతున్న మణుగూరు పరిసర ప్రాంత ప్రజలు పెద్దఎత్తున ఆసుపత్రికి వచ్చి కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు పొందుతున్నారు. గతంలో 30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసింది. దీంతో 24 గంటలూ రోగులకు వైద్యసేవలు అందుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే భయపడే రోగులు నేడు పెద్దఎత్తున ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి ధైర్యంగా ఉచిత వైద్యసేవలు పొందుతున్నారు.
‘100 పడకల’ మంజూరుకు రేగా కృషి
మణుగూరులో గతంలో ఉన్న 30 పడకల ఆసుపత్రితో రోగులకు అరకొర సౌకర్యాలు అందుతుండడంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక దృష్టి సారించి సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్రావును పలుమార్లు కలిసి ఆసుపత్రిని 100 పడకలుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. ఈ మేరకు సుమారు రూ.3కోట్ల నిధులు మం జూరు చేయడంతో ఆసుపత్రి అప్గ్రేడ్ అయ్యింది. దీంతోపాటు ఎమ్మెల్యే రేగా మరో రూ.కోటితో ఆసుపత్రి ఆవరణలో సీసీ రోడ్లు, పోస్టుమార్టం గది, ధోబీఘాట్, పార్కు నిర్మాణ పనులకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 100 పడకల ఆసుపత్రిలో రోగులకు మెరుగైన కార్పొరేట్ వైద్యసేవలు అందుతున్నాయి.
కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం
కార్పొరేట్ స్థాయిలో అన్నిరకాల అధునాతన సౌకర్యాలతో ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాం. ఆపరేషన్ థియేటర్ల ఆధునీకరణతో అరుదైన శస్త్రచికిత్సలు సైతం చేయిస్తున్నాం. 100 పడకల ఆసుపత్రిలో ఐదుగురు ఎంబీబీఎస్ వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తున్నాం. ప్రజలు, రోగులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి.
– రాంప్రసాద్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, మణుగూరు
పెరిగిన ప్రసవాలు…
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైన మహిళలకు సీఎం కేసీఆర్ పారితోషకంతోపాటు కేసీఆర్ కిట్లు అందిస్తానని ప్రకటించడంతో మణుగూరు ఏరియా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ వరకు 318 సాధారణ ప్రసవాలు, 125 సిజేరియన్ ప్రసవాలు మొత్తం 443 ప్రసవాలు జరిగాయి. వీరికి 443 కేసీఆర్ కిట్లు అందజేశారు. వీటితోపాటు 352 గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు సైతం అందించారు.
త్వరలో బ్లడ్ స్టోరేజీ యూనిట్
పారిశ్రామిక ప్రాంతమైన మణుగూరులో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్న దృష్ట్యా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మరో 15రోజుల్లో రూ.15లక్షల నిధులతో బ్లడ్ స్టోరేజీ యూనిట్ను సైతం నెలకొల్పనుంది. దీంతో రక్తం అవసరమైన వారికి రక్తదానం చేసేందుకు సైతం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
డబ్బులు వృథా చేసుకోవద్దు..
మణుగూరు పరిసర ప్రాంత ప్రజలు, ఏజెన్సీ గ్రామాల ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దు. మణుగూరు 100 పడకల ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వం అన్నిరకాల అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నది. ప్రజలు, రోగులు ప్రభుత్వం అందించే ఉచిత సేవలను పొందాలి. గర్భిణులు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేయించుకుని ప్రభుత్వం అందించే పారితోషకం, కేసీఆర్ కిట్లు పొందవచ్చు. చిన్నచిన్న శస్త్రచికిత్సలు సైతం నిత్యం వైద్యులు అందుబాటులో ఉండి చేస్తున్నారు. మణుగూరు ఏరియా ఆసుపత్రి కార్పొరేట్ వైద్యానికి నిలయంగా మారింది.
– ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
కిడ్నీ రోగులకు వరం ‘డయాలసిస్ కేంద్రం’
మూత్రపిండాల వ్యాధితో బాధపడే రోగులు గతంలో డయాలసిస్ చేయించుకోవాలంటే భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం వెళ్లాల్సి వచ్చేది. ప్రభుత్వం వారి అవస్థలను గుర్తించి మణుగూరు ఏరియా ఆసుపత్రిలోనే ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇటీవల దీనిని ప్రభుత్వ విప్ రేగా ప్రారంభించడంతో కిడ్నీ రోగుల బాధలు తప్పాయి. గతంలో ఎంతోదూరం వెళ్లి డయాలసిస్ చేయించుకునే స్థితి నుంచి నేడు మణుగూరులోనే డయాలసిస్ సేవలు పొందడంతో కిడ్నీ రోగులకు ఇది వరంగా మారింది.