చర్ల, ఏప్రిల్ 12 : అమాయక గిరిజనులను మావోయిస్టులు తమ పార్టీలోకి తీసుకొని స్వార్థానికి వాడుకుంటున్నారని, వారిచేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ‘ఆపరేషన్ చేయూత’లో భాగంగా చర్ల పోలీస్స్టేషన్లో శుక్రవారం అజ్ఞాత దళ కుటుంబ సభ్యుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో నిధులు కేటాయిస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతుంటే వాటిని మావోయిస్టులు అడ్డుకోవడం సరికాదన్నారు. తెలిసో తెలియకో కుటుంబాలను వదిలి మావోయిస్టు పార్టీలో చేరిన వారు తిరిగి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఇందుకోసం చేపట్టిన ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని,
ఈ క్రమంలోనే చర్ల మండలం బూరుగుపాడుకు చెందిన వంజం దేవా, కాంపెల్లికి చెందిన రాజ్కుమార్ అలియాస్ రంజిత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జేగురుగొండ మండలం తిమ్మాపూర్కు చెందిన సోడి గంగా, సుకుమా జిల్లా డోకుపాడుకు చెందిన కల్మ దేవా.. మవోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ వివరించారు. అలాగే ఇటీవల లొంగిపోయిన ఎర్రంపాడుకు చెందిన మడివి కృష్ణ, పూనెం అడమయ్య, వెట్టి భీమాలకు ఎస్పీ రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సునీల్కుమార్, 141 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్కుమార్, చర్ల సీఐ రాజ్వర్మ, దుమ్ముగూడెం సీఐ అశోక్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రమేశ్, అశోక్రెడ్డి, ముత్యం రమేశ్, ఎస్సైలు పాల్గొన్నారు.