కొత్తగూడెం క్రైం, మార్చి 21 : బీజేపీతోపాటు అంటకాగుతున్న పార్టీలను తరిమికొట్టి దేశాన్ని, ప్రజలను కాపాడాలంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో సోషల్ మీడియాలో విడుదలైన లేఖ సంచలనం సృష్టిస్తోంది. లోక్సభతోపాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరుగనున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న పార్టీలన్నీ ప్రజలను మళ్లీ మోసగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలన్నీ ఓట్ల కోసం మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంచిపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాయో తెలినిది కాదని లేఖలో పేర్కొంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 2019లో ఎన్నికలకు ముందు కుట్రపూరితంగా పుల్వామా ఘటనను సృష్టించి.. మతోన్మాదాన్ని, జాతీయ నినాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల ఓట్లను దండుకున్నదని ఆరోపించారు. ఈసారి కూడా రామ మందిరాన్ని రెండు వేల కోట్లతో నిర్మించి దానిని ఎరగా చూపి పార్లమెంట్ ఎన్నికలకు ముందుకు తీసుకెళ్తున్నదని పేర్కొన్నారు. పదేండ్ల మోదీ పాలనలో మధ్య యుగాల నాటి ఫ్యూడల్ నిరంకుశత్వ రాష్ర్టాన్ని స్థాపించే లక్ష్యంతో హిందూత్వ ఫాసిజాన్ని అమలు చేస్తూ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిందని లేఖలో వెల్లడించారు. సామ్రాజ్యవాద ప్రపంచీకణ విధానాలను అమలు చేసే కాంగ్రెస్ పార్టీని, ఓట్ల కోసం వచ్చే ఇతర పార్టీలను నిలదీయాలని పేర్కొన్నారు. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి సోషలిజాన్ని నిర్మించుకోవాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ లేఖ ద్వారా పిలుపునిచ్చింది.