ఖమ్మం, డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా అంబారుపేటలోని శ్రీసత్య సత్యమ్మ అమ్మ వారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, వసంతలక్ష్మి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు మంత్రి పువ్వాడ దంపతులకు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పువ్వాడ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, ఈవో నాగరాజు తదితరులు మంత్రి దంపతులను సత్కరించారు.
నేడు అశ్వాపురం, మణుగూరులో మంత్రి పువ్వాడ పర్యటన
ఖమ్మం, డిసెంబర్ 4: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన వ్యక్తిగత సహాయకుడు సీహెచ్ రవికిరణ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఖమ్మం వీడీవోస్ కాలనీలో తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10:40 గంటలకు అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామానికి చేరుకుంటారు. అక్కడ సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 11 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11:15 గంటలకు అశ్వాపురం మెయిన్రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ సైడ్ డ్రెయిన్, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. 11.30 గంటలకు అశ్వాపురం నుంచి బయలుదేరి 11:45 గంటలకు మణుగూరు చేరుకొని అక్కడ ప్రైవేటు లాడ్జీని ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు మణుగూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకొని అక్కడ కళాశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 12:15 గంటలకు మణుగూరులోని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు క్యాంపు కార్యాలయంలో ప్రెస్మీట్లో పాల్గొంటారు. 12:40 గంటలకు మణుగూరు అంబేద్కర్ సెంటర్కు, ఒంటిగంటకు అశ్వాపురానికి చేరుకుంటారు. అక్కడ బోజనం చేసిన తరువాత 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.