వైరా టౌన్, ఫిబ్రవరి 24: ముఖ్యమం త్రి కేసీఆర్ అపర చాణక్యుడని, ఆయనతో తులతూగే వ్యక్తి రాష్ట్రంలో మరెవ్వరూ లేరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మొలకెత్తించిన ఉద్యమసారథి ఆయనేనని అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్స్ మండల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)లో ఉండి పార్టీకి ద్రోహం చేశారని, వైరా నియోజకవర్గంలోని పార్టీ అభ్యర్థిని ఓడించి స్వతంత్ర అభ్యర్థిని గెలిపించారని అన్నారు. అలాంటి కుట్రలను పార్టీ సహించబోదని అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ఎలాగైతే వ్యాక్సిన్ను కనుగొన్నారో శ్రీనివాసరెడ్డి విషయంలో తాము కూడా అలాగే వ్యాక్సిన్ను కనుగొంటామని అన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో చరిష్మా గల నాయకులు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని అన్నారు. పొంగులేటిని కూడా వారిలాగా పోల్చుకుంటే గంగలో కలిసిపోతారని అన్నారు. ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లేవారు తాడూ బొంగరం లేకుండా దిక్కులేని పక్షులుగా ఉంటారని అన్నారు. బీఆర్ఎస్లోలో ఉంటూనే కోవర్టులుగా మారవద్దని సూచించారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, షేక్ లాల్మహ్మద్, బీడీకే రత్నం, వేల్పుల పావని, నంబూరి కనకదుర్గ, బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, పసుపులేటి మోహన్రావు, కట్టా కృష్ణార్జున్రావు, వనమా విశ్వేశ్వరరావు, మచ్చా బుజ్జి తదితరులు పాల్గొన్నారు.