ఒకప్పుడు సర్కారు బడులంటే సమస్యల ఆనవాళ్లే.. నేలమీద కూర్చునే విద్యార్థులే కన్పించేవారు. పగిలిన గచ్చులు, పెచ్చులూడిన స్లాబులతో అవస్థలు పడేవారు. ఒంటికి రెంటికి వెళ్లాలంటే.. సౌకర్యాలు లేక తిప్పలు పడేవారు. తాగునీటితోపాటు రాతకు పనికిరాని బ్లాక్బోర్డులు, ఇరుకైన గదుల వల్ల ఎన్నో సమస్యలతో సర్కారు స్కూళ్లు సతమతమయ్యేవి. కానీ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుల రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. కేజీ టు పీజీ పేరిట నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నది. తాజాగా పాఠశాలల బాగు కోసం నడుం బిగించారు.
ఇందులో భాగంగానే ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐల సహకారంతోపాటు రాష్ట్ర ప్రభుత్వమూ నిధులను మంజూరు చేసి బడులను బాగు చేస్తున్నది. సర్కారు బడులంటే సమస్యల లోగిళ్లు కాదని.. కార్పొరేట్ స్థాయిని తలదన్నే ఆధునిక విద్యానిలయాలని నిరూపించారు. ‘మన బడి’ మొదటి విడుత కింద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ మండలాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సర్కారు బడులను బుధవారం వైభవంగా ప్రారంభించనున్నారు.
చింతకాని/ ఇల్లెందు రూరల్, జనవరి 31: ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మెరుగుపర్చాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కార్యరూపంలోకి వచ్చింది. ఆధునిక వసతి సౌకర్యాలతో మొదటి విడుతలో తీర్చిదిద్దిన పాఠశాలలను ప్రజాప్రతినిధులు, అధికారులు బుధవారం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం కింద చింతకాని మండలంలో 16 పాఠశాలలు మొదటి విడుతలో ఎంపికయ్యాయి. ప్రొద్దుటూరు, వందనం గ్రామాల ప్రాథమిక పాఠశాలల్లో కాంట్రాక్టర్లు పనులను యుద్ధప్రాతిపదికన మొదలుపెట్టి వంద శాతం పూర్తి చేశారు. ప్రొద్దుటూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. ప్రహరీ నిర్మించారు. అధునాతన టైల్స్తో కూడిన టాయిలెట్లు నిర్మించారు.
ఇంతకుముందు ఉన్న మరమ్మతులను పూర్తి చేశారు. ఆరు గదులకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. 20 ఫ్యాన్లు, 20 ట్యూబ్లైట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అనువుగా కార్పొరేట్ స్థాయిలో ఉండే 55 బెంచీలు సమకూర్చారు. ప్రత్యేకంగా వంట గదిని నిర్మించారు. ఉపాధ్యాయులకు అధునాతన కుర్చీలు, పాఠాల బోధనకు ఆరు గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. మిలమిల మెరిసే టైల్స్తో అతి పెద్ద హ్యాండ్వాష్ సింకులను నిర్మించారు. మొత్తంగా ఈ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ఇప్పుడు దానిని చూసిన వారందరూ అనే మాట ఒక్కటే.. ‘కార్పొరేట్ స్కూలు కాదిది. సర్కారు బడి’. అని.
ప్రైవేటుకు దీటుగా..
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు సీఎం కేసీఆర్. గ్రంథాలయం, ఆటస్థలం, సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం, రెండు జతల యూనిఫాం, ఆంగ్ల మాధ్యమ బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యా బోధన, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, మెరుగైన ఉత్తీర్ణత తదితర అంశాలతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా రాణిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ఖమ్మంలో ప్రారంభించనున్న మంత్రి అజయ్..
ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 31: ‘మన ఊరు మన బడి’ కింద మొదటి విడుతలో ఎంపికై పనులు పూర్తయిన ఖమ్మం శాంతినగర్ ఉన్నత పాఠశాల, మామిళ్లగూడెం ప్రాథమిక పాఠశాలలను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం ప్రారంభించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని స్కూళ్లను అక్కడి ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం కింద పనులు పూర్తయిన స్కూళ్లు జిల్లాలో 32 ఉన్నాయి. వీటిలో 8 స్కూళ్ల ప్రారంభోత్సవంలో అక్కడి ప్రజాప్రతినిధులు భాగం కానున్నారు. ఖమ్మం శాంతినగర్ ఉన్నత పాఠశాల, మామిళ్లగూడెం ప్రాథమిక పాఠశాల, బోనకల్లు మండలం ఆళ్లపాడు ఎంపీపీఎస్, నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం ఎంపీపీఎస్, సత్తుపల్లి మండలం పాకాలగూడెం, బుగ్గపాడు ఎంపీపీఎస్లు, ఏన్కూరు మండలం గార్ల్లొడ్డు ఎంపీపీఎస్, వైరా మండలం గొల్లెనపాడు ఎంపీయూపీఎస్లను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రారంభించేందుకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు.
పనులను పరిశీలించిన కలెక్టర్..
ఖమ్మంలో ‘మన బడి’ కింద ఎంపికై బుధవారం ప్రారంభం కానున్న పాఠశాలలను కలెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. సంబంధిత ఇంజినీరింగ్ విభాగాధికారులతో కలిసి పాఠశాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. డీఈవో సోమశేఖరశర్మ, సెక్టోరల్ అధికారి సీహెచ్ రామకృష్ణలు డ్యూయల్ డెస్కుల సరఫరా, గ్రీన్బోర్డులు ఫిట్ చేయించడం, పచ్చదనం వంటి వాటిని దగ్గర ఉండి పూర్తి చేయించారు. శాంతినగర్ పాఠశాలలో సోలార్ ప్యానెళ్లను పూర్తి చేయగా.. జెన్కో అధికారులు పాత విద్యుత్ మీటర్ బోర్డు తొలగించి కొత్తది ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఇతర పాఠశాలల్లోనూ ఇవే సౌకర్యాలు..
చింతకాని మండలంలోని 45 పాఠశాలల్లో మొదట విడుతగా 16 పాఠశాలలను ‘మన బడి’కి ఎంపిక చేశారు. వాటిల్లో ఎంపీపీఎస్ ప్రొద్దుటూరు, ఎంపీపీఎస్ వందనం, ఎంపీపీఎస్ చింతకాని, ఎంపీపీఎస్ కొదుమూరు, ఎంపీపీఎస్ నాగులవంచ, ఎంపీపీఎస్ జీ నాగులవంచ, ఎంపీపీఎస్ అనంతసాగర్, ఎంపీపీఎస్ పందిళ్లపల్లి, ఎంపీపీఎస్ కోమట్లగూడెం, ఎంపీపీఎస్ నేరడ, ఎంపీపీఎస్ రామకృష్ణాపురం, జడ్పీఎస్ఎస్ చింతకాని, జడ్పీఎస్ఎస్ పందిళ్లపల్లి, జడ్పీఎస్ఎస్ కొదుమూరు, జడ్పీఎస్ఎస్ రామకృష్ణాపురం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల నాగులవంచ ఉన్నాయి. పనులు పూర్తయిన ఎంపీపీఎస్ ప్రొద్దుటూరు, ఎంపీపీఎస్ వందనం పాఠశాలలను ప్రజాప్రతినిధులు, అధికారులు బుధవారం ప్రారంభించనున్నారు. ఇల్లెందు మండలంలోనూ 30 ప్రభుత్వ పాఠశాలలు ‘మన ఊరు మన బడి’ కింద ఎంపికయ్యాయి. వీటిల్లో నాలుగు హైస్కూళ్లు, 26 ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి.
పిల్లలు సంతోషంగా స్కూలుకెళ్తున్నారు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకు నేందుకు విద్యార్థులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. కార్పొరేట్ స్థాయి లో సౌకర్యాలు ఉండడంతో వారు సంతోషంగా, ఎంతో ఇష్టంగా స్కూలుకు వెళ్తున్నారు. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధన కూడా చాలా బాగుంది. నూతన బల్లాలు, కుర్చీలు ఏర్పాటయ్యాయి. ఒకనాడు బూజు పట్టిన గోడలు నేడు రంగులతో కళకళలాడు తున్నాయి. నాణ్యమైన మధ్యాహ్న భోజనంతోపాటు డిజిటల్ క్లాసులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు సంబురపడుతున్నారు.
-బానోత్ శ్రీదేవి, స్టేషన్ బస్తీ, ఇల్లెందు
ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది..
ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు పరిశుభ్రమైన టాయిలెట్లు, చేతిపంపులు రూపుదిద్దుకున్నాయి. బడుల ఆవరణలో ఎటు చూసినా పచ్చదనమే వెల్లివిరుస్తోంది. ‘మన బడి’ కార్యక్రమంతో స్కూళ్లన్నీ కళకళలాడుతున్నాయి. పిల్లలు కూడా ఇంట్లో ఉండేందుకంటే స్కూల్లో ఉండేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఊర్దూ మీడియం పాఠశాలను మా బస్తీలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.
-హమీదా బేగం, సేష్టన్బస్తీ, ఇల్లెందు
పాఠశాలల రూపురేఖలు మారాయి..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. ఈ కార్యక్రమం కింద వచ్చిన నిధులతో పాఠశాలల్లో అన్ని సౌకర్యాలనూ ఏర్పాటు చేశాం. ‘మన బడి’ మొదటి విడుత కింద ఎంపికైన పాఠశాలల్లో అన్ని వసతులూ ఏర్పాటు చేశాం. ఈ పాఠశాలలను బుధవారం ప్రారంభిస్తాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సర్కారు బడులు ముస్తాబు కావడంతో విద్యార్థులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపుతున్నారు.
-పిల్లి శ్రీనివాస్, కాంప్లెక్స్ హెచ్ఎం, ఇల్లెందు
థ్యాంక్స్ టు కేసీఆర్ తాతయ్య..
ఎంపీపీఎస్ ప్రొద్దుటూరు ప్రాథమిక పాఠశాలలో మేము మూడో తరగతి చదువుతున్నాం. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ద్వారా మేము చదువుతున్న పాఠశాలను అధికారులు తీర్చిదిద్దారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉండే సౌకర్యాల కంటే మెరుగైన వసతులను మా పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ స్కూలుకు రావడమే మాకు సంతోషంగా ఉంది. మా చదువు పూర్తయ్యే వరకూ ఇదే పాఠశాలలో చదువుకుంటాం.
-కనకపుడి మైథిలి, కోల్లి రేష్మా, చింతకాని