తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకవాయె. కడిగేందుకు కడివెడు నీళ్లు కరువాయె. భగవంతుడా ఇదెక్కడి గోస..? ఇదెక్కడి కష్టం..? కోశెడు దూరం వెళితేనే కడివెడు నీళ్లు.. వ్యవసాయ బావులు, చెలిమెలే నీటి వనరులు.. బోర్ల చుట్టూ బారులు.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ఆందోళనలు.. అయినా పట్టించుకునే నాథుడే ఉండడు.. గత ప్రభుత్వాల హయాంలో ఇదంతా మనం కళ్లారా చూశాం.. నీటి కష్టాలను అనుభవించాం.. ఇప్పుడు పరాయి పాలన పోయింది.. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘మిషన్ భగీరథ’ పథకాన్ని అమలు చేశారు.. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. రూ.కోట్లతో గ్రామాల్లో పైప్లైన్స్ ఏర్పాటు చేయించారు.. వాటర్ ట్యాంక్స్ నిర్మించారు.. ప్రతి ఇంట్లో నల్లాలు బిగించారు.. తాగునీటి కష్టాలు తీర్చారు.. అందుకే ఇది ప్ర‘జల’ పథకం.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉభయ జిల్లాల్లో మంచినీటి దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
-ఖమ్మం/కొత్తగూడెం టౌన్/కూసుమంచి, జూన్ 17
మనిషి బతికి ఉండాలంటే గాలి తర్వాత కావాల్సింది తాగునీరు. ప్రజలందరికీ కనీస సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదు. గ్రామాల్లో తాగునీరు లేక జనం అరిగోస పడ్డారు. అయితే స్వరాష్ట్రంలో ఒక్క తాగునీరు కాదు.. సాగునీటి కష్టాలకు సైతం ఫుల్స్టాఫ్ పెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనతికాలంలోనే ‘మిషన్ భగీరథ’ చేపట్టి ఇంటింటికీ నల్లా నీటిని ఉచితంగా అందిస్తూ అభినవ భగీరథుడిగా పేరుగాంచారు కేసీఆర్. పల్లెల్లో ఈ నీటినే ‘కేసీఆర్ నీళ్లు’గా పిలుచుకుంటున్నారు. జనం తాగునీటి కష్టాలను మర్చిపోయి ఎన్నో ఏండ్లు గడిచిపోయాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ‘మంచినీళ్ల పండుగ’ను ఘనంగా జరుపుకునేందుకు పల్లె జనం సిద్ధమయ్యారు. ప్రతి నల్లా, వ్యాటర్ట్యాంక్ ఎదుట ముగ్గులు వేసి సంబురం చేసుకోనున్నారు.
ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో పాలేరు, వైరా, గోదావరి సెగ్మెంట్లు ఏర్పాటు చేయగా, ఆ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.4,126 కోట్లను ఖర్చు చేసింది. పాలేరు సెగ్మెంట్కు రూ.671 కోట్లు, వైరా సెగ్మెంట్కు రూ.855 కోట్లు, గోదావరి సెగ్మెంట్కు 2,600 కోట్లు ఖర్చు చేసింది. జిల్లాలోని ఖమ్మం నగరంతోపాటు 40 మండలాలు, 6 మున్సిపాలిటీల్లోని 2,658 గ్రామాల్లో 25.08 లక్షల మందికి తాగునీటిని అందించేందుకు అధికారులు ‘మిషన్ భగీరథ’ పథకాన్ని నిర్మాణం చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రజలకు మంచినీటిని అందించేందుకు పాలేరు, వైరా రిజర్వాయర్లతోపాటు, గోదావరి సెగ్మెంట్ ప్రాంతానికి దుమ్ముగూడెం నుంచి నీళ్లు అందింస్తున్నారు. 10 శాసనసభ నియోజకవర్గ పరిధిలోని 1,145 గ్రామాల ప్రజలకు మంచినీరు అందుతున్నది. 2015 మే నెలలో ప్రారంభమైన మిషన్ భగీరథ పనులు గత మూడు సంవత్సరాల క్రితమే పూర్తయ్యాయి, దీనికి గాను రెండు జిల్లాల పరిధిలోని 4,584 కిలో మీటర్ల మెయిన్ పైపులైన్ను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇంకా 38 కిలోమీటర్ల వ్యవసాయ భూముల్లో ప్రధాన పైపులైన్లు వేశారు. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన 96 స్టక్చర్లను(ట్యాంక్లు, సంపులు) పూర్తి చేశారు. పాలేరు, వైరా ఇంటెక్వెల్ పూర్తయింది.
పాలేరు రిజర్వాయర్ నుంచి పంపుసెట్స్ ద్వారా రా వాటర్ను జీళ్లచెరువు దగ్గర గుట్టపై నిర్మించిన ట్యాంక్లకు తరలిస్తూ అక్కడ ట్రీట్ చేసి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ప్రధాన పైప్లైన్ల ద్వారా గ్రామాలకు సురక్షిత నీటిని తరలిస్తున్నారు. జీళ్లచెరువు నుంచి 370 గ్రామాలకు రోజుకు (90 ఎంఎల్టీ) 9 కోట్ల లీటర్ల నీటిని అందిస్తున్నారు. కూసుమంచి మండలంలోని 79 గ్రామాలకు, నేలకొండపల్లిలోని 37, ఖమ్మం రూరల్లోని 73, తిరుమలాయపాలెంలో 77, ఖమ్మం అర్బన్(రఘునాథపాలెం)లో 46, ముదిగొండ 32, చింతకానిలోని 26 గ్రామాలకు మంచినీటిని అందిస్తున్నారు. జీళ్లచెర్వు వద్ద ప్రత్యేకంగా నిర్మించిన ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇంటెక్వాల్, సంపుల పైప్లైన్ల ఏర్పాటు చేవారు. ఈ ట్యాంక్ ద్వారా ఖమ్మం కార్పొరేషన్కు మంచినీటిని అందిస్తున్నారు.
వైరా రిజర్వాయర్ నుంచి వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.730 కోట్లను ఖర్చు చేసింది. వైరా రిజర్వాయర్ నుంచి తనికెళ్ల దగ్గరలోని ముక్రిహిల్స్ వద్ద సంప్లను, ఓహెచ్బీఆర్లను నిర్మించారు. అక్కడి నుంచి(50 ఎంఎల్టీ) 5కోట్ల లీటర్లను ప్రతిరోజు ప్రజలకు అందిస్తున్నారు. ముక్రిహిల్స్ నుంచి మధిర నియోజకవర్గంలోని బోనకల్, మధిర, ఎర్రుపాలెం, చింతకాని మండలంలోని కొన్ని గ్రామాలను కలుపుకుని మొత్తం 462 గ్రామాలకు సురక్షిత మంచినీటిని ప్రతిరోజు ప్రజలకు అందిస్తున్నారు. వైరా రిజర్వాయర్ నుంచి కల్లూరు వద్ద గల కనకగిరి హిల్స్ నుంచి వైరా, సత్తుపల్లి నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలకు మంచినీటిని అందిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం 1,073 కిలోమీటర్ల దూరం వరకు ప్రధాన పైప్లైన్లు నిర్మాణాన్ని పూర్తిచేశారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రధాన పైప్లైన్ నిర్మాణంతోపాటు ఓహెచ్బీఆర్ ట్యాంక్ల నిర్మాణం, సంపుల నిర్మాణం, బావుల నిర్మాణం పూర్తయింది. రెండు జిల్లాలకు కలిపి రూ.573 కోట్లను ఖర్చు చేసింది. ఖమ్మం జిల్లాలోని 519 గ్రామాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 752 గ్రామాల్లో ఓవర్హెడ్ ట్యాంక్లను నిర్మించారు. పక్కా ప్రణాళికతో మిషన్ భగీరథకు రూపకల్పన చేశారు. ఉమ్మడి జిల్లాలోని 40 మండలాల్లో ప్రాజెక్టును పూర్తిచేయడానికి రూ.3,558 కోట్లను ఖర్చు చేశారు. వాటర్గ్రిడ్ కింద ప్రధాన పైపులైన్లు సుమారు 4,600 వేల కిలోమీటర్లు వేశారు.
ఖమ్మం కార్పొరేషన్లోని ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రూ.230 కోట్లు ఖర్చు చేశారు. 17 కొత్త వాటర్ట్యాంకులను నిర్మించారు. 14 ఓవర్హెడ్ ట్యాంకులను వినియోగిస్తూ 31,600 నల్లాలకు నిరంతరం నీటిని అందిస్తున్నారు.
ఖమ్మం నగరంలో 5 వాటర్ ట్యాంక్లను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదివారం ప్రారంభించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అందించారు. శుద్ధి చేసిన నీటిని ఒకరికి వంద లీటర్ల చొప్పున అందిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా 24 మండలాల్లోని 1,519 గ్రామాల్లో 818 ఓవర్హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. 2,223 కిలోమీటర్ల మేర పైపులైన్ వేశారు. 2,06,643 నల్లాల కనెక్షన్లు ఇచ్చారు. రూ.313 కోట్లతో పనులు పూర్తిచేశారు. రహదారికి కూడా అవకాశం లేని మారుమూల గ్రామాల్లో నివసించే గొత్తికోయ ప్రజల కోసం సోలార్ పంపుసెట్ల ద్వారా రక్షిత మంచినీటిని అందించడం జరుగుతున్నది. దీనికై ప్రత్యేకించి ప్రభుత్వం రూ.9.50 కోట్లను ఖర్చు చేసింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పాల్వంచ మండలంలోని తోగ్గూడెం గ్రామంలో 145 ఎంఎల్డీ నీటిశుద్ధి కేంద్రం వద్ద ‘మంచినీళ్ల పండుగ’ను నిర్వహించనున్నారు. దీనికోసం ఆ శాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాష్ట్రంలో నీటి ఎద్దడి నివారణకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధజలం సరఫరా చేస్తున్నారు. దీంతో వానకాలంలో సీజనల్ వ్యాధులు తగ్గాయి. మిషన్ భగీరథ పథక నిర్వహణ కత్తిమీద సాము అయినప్పటికీ అధికారులు సమర్థంగా నిర్వహిస్తున్నారు.
– ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి
మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో ప్రజలందరికీ 2,06,643 నల్లాల ద్వారా శుద్ధ జలాన్ని అందజేస్తున్నాం. కలెక్టర్ అనుదీప్, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సూచనలు, సలహాలతో పనులను పూర్తి చేశాం. పనులను త్వరితగతిన పూర్తిచేశాం.
– ఎన్.తిరుమలరావు, మిషన్భగీరథ, ఈఈ, కొత్తగూడెం
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ‘మంచినీళ్ల’ పండుగ నిర్వహిస్తున్నాం. మహిళలు మిషన్ భగీరథ పంపులు, వాటర్ ట్యాంక్లు వద్ద ముగ్గులు వేస్తారు. ప్రజలతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు ర్యాలీల్లో పాల్గొంటారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో సమావేశాలు, సభలు నిర్వహిస్తారు. మిషన్ భగీరథ విజయాలను ప్రజలకు వివరిస్తారు.
– పుష్పలత, మిషన్ భగీరథ ఈఈ, ఖమ్మం