కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ జీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓఎస్డీ కార్యాలయంలో పోలీస్శాఖ కోసం ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాన్ని ఎస్పీ వినీత్ గంగన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో సహా కలిసి కంటి పరీక్షలు చేయుంచుకుని, ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం ఉచితంగా అందజేసే కళ్లజోళ్లను పొందాలన్నారు. రెండ్రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటిరోజు సుమారు 100మందికి పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ వినీత్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ టి.సాయి మనోహర్, జిల్లా వైద్యారోగ్య అధికారి శిరీష, ప్రోగ్రాం ఆఫీసర్ పర్షియానాయక్, ఆర్ఐ పిన్నింటి ప్రసాద్, ఆర్ఎస్సైలు రామకృష్ణ, ఓం ప్రకాశ్, పీఆర్వో దాములూరి శ్రీనివాస్, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
31మంది బాలకార్మికులకు విముక్తి..
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీస్శాఖ పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నదని ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న అన్నారు. జిల్లాలో నెలరోజుల వ్యవధిలో 31మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు సోమవారం ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో భాగంగా ప్రతి ఏడాది జనవరి 1నుంచి 31వ తేదీ వరకు జిల్లా పరిధిలో ‘ఆపరేషన్ స్మైల్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్(ఏహెచ్టీయూ), చైల్డ్ లైన్, లేబర్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో 5బృందాలుగా ఏర్పడి 9వ విడత ‘ఆపరేషన్ స్మైల్’ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా పరిధిలో గత నెలలో వివిధ పరిశ్రమలు, ఇటుక తయారీ కేంద్రాలు, కంకర క్రషర్స్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేసి 31మంది బాల కార్మికులకు విముక్తి కలిగించినట్లు పేర్కొన్నారు. వారిలో 22మంది బాలురు, 9మంది బాలికలు ఉన్నారని వివరించారు.
బాల కార్మికుల్లో రాష్ట్రానికి చెందిన వారు 11మంది, మిగతా 20మంది వివిధ రాష్ర్టాలకు చెందిన బాలబాలికలుగా విచారణలో తేలిందని తెలిపారు. చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి చిన్నారులతోపాటు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. చిన్నారులతో పనులు చేయించిన వ్యాపారులపై 17కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఎవరైనా పిల్లలతో పనులు చేయించుకుంటున్నట్లు తెలిస్తే ‘డయల్ 100’ లేదా 1098 నంబర్లకు సమాచారాన్ని అందించాలని ఈ సందర్భంగా ఎస్పీ వినీత్ ప్రజలను కోరారు.