కారేపల్లి : మొక్కజొన్న రైతులు సోమవారం రాత్రి కారేపల్లిలోని గోదాం వద్ద అందోళనకు దిగారు. సోసైటీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రం ద్వారా ట్రాక్టర్లు, లారీలతో తీసుకొచ్చిన మొక్కజొన్న బస్తాలను అప్పాయిగూడెం గోదాంలో దించుకోకుండా ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. వే బ్రిడ్జి కాటా వద్ద రోజుల తరబడి వేచిచూస్తున్నామని సోమవారం వచ్చి గోదాం నిండిందని.. వేరే ప్రాంతాలకు మక్కలు తీసుకెళ్లాలని సోసైటీ వారి ద్వారా అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కారేపల్లిలోని జిన్నింగ్ మిల్లులో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతుల మొక్కజొన్న నిల్వ చేస్తున్నారు. కానీ, తమను మాత్రం 200 కిలోమీటర్ల దూరంలోని నల్గొండ జిల్లా చిలకమర్రి గోదాంకు వెళ్లాలని చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం నుండి బస్తా ý తరలింపునకు లారీలు రాక పోవటంతో తాము లారీలు, ట్రాక్టర్లలను తెప్పించుకోని గోదాంకు వస్తే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన చెందారు.
తమ మొక్కజొన్న బస్తాలను కారేపల్లిలోని గోదాంలో నిల్వ చేసేందుకు అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన విషయం తెలిసి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, బీఆరఎస్ నాయకులు లాకావత్ లక్ష్మన్ రైతులు, అధికారులతో మాట్లాడారు. మక్కజొన్న రైతుల ఆవేదనను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లగా అయన స్పందించారు. మంగళవారం లోపు మక్క పంట కారేపల్లిలోనే దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.