కారేపల్లి, మార్చి 7: మండలంలోని పోలంపల్లి పంచాయతీలోగల కోటిలింగాల (మహాశివరాత్రి) జాతర శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జరగనుంది. ఇల్లెందు డివిజన్లో రెండవ పెద్ద జాతరగా ఇది ప్రసిద్ధిచెందింది. ఈ జాతరకు వేలమంది భక్తులు తరలివస్తారు. పక్కనేగల కోటిలింగాల వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, శివపార్వతులను ధర్శించుకుంటారు. శుక్రవారం రాత్రి స్వామి వారి కల్యాణం ఉంటుంది.
వైరా రూరల్, మార్చి 7: మండలంలోని స్నానాల లక్ష్మీపురం రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర శుక్రవారం రాత్రి నుంచి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణోత్సవం ఉంటుంది. జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ గురువారం పరిశీలించారు. కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు హాజరవుతారని చెప్పారు.
సత్తుపల్లి, మార్చి 7: పెనుబల్లి మండలం నీలాద్రిలోని నీలాద్రీశ్వరాలయస్వామి ఆలయానికి శుక్రవారం తెల్లవారుజామున 3.00 గంటల నుంచి ప్రతి పది నిముషాలకు ఒకటి చొప్పున బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి తెలిపారు. సత్తుపల్లి నుంచి నీలాద్రికి 20 ప్రత్యేక బస్సులను శనివారం ఉదయం వరకు నడపనున్నట్లు తెలిపారు.
వైరా రూరల్, మార్చి 7: వైరా నుంచి స్నానాల లక్ష్మీపురం వరకు శుక్రవారం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మధిర డిపో మేనేజర్ డి.శంకర్రావు ఓ ప్రకటనలో తెలిపారు.
కల్లూరు, మార్చి 7: స్థానిక పుల్లయ్య బంజరు రోడ్డులోని కాశ్మీర మహాదైవక్షేత్రం(శివాలయం)లో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను రూరల్ సీఐ వెంకటేష్ గౌడ్, ఎస్సై షాకీర్ గురువారం పరిశీలించారు.
ఖమ్మం రూరల్, మార్చి 7: మహాశివరాత్రి వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సునీల్దత్ తెలిపారు. గురువారం మండలంలోని తీర్ధాల సంఘమేశ్వర ఆలయాన్ని ఆయన సందర్శించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, ఏసీపీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని తీర్ధాల సంఘమేశ్వర ఆలయానికి వచ్చే భక్తులు నిర్ధేశించిన పార్కింగ్ స్థలాలలోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని సీపీ సునీల్దత్ సూచించారు. ఈ సందర్బంగా రూట్ మ్యాప్ వివరాలను ఆయన గురువారం విడుదల చేశారు. నిర్ధేశించిన ప్రదేశాలలోనే పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.
తిరుమలాయపాలెం, మార్చి 7: మండలంలోని పిండిప్రోలు, బీరోలు, సుబ్లేడు, కాకరవాయి శివాలయాల్లో నేడు పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. ఆలయ ధర్మకర్త మడికంటి వీరభద్రస్వామి అన్ని పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.