అరగంటలోనే చేపల లారీ మాయం
పోటీపడి మరి చేపలు ఎత్తుకెళ్లిన జనం
ఏలూరు నుంచి ఏటూరునాగారం వెళ్తుండగా ఘటన
బూర్గంపహాడ్, జూన్ 7: మండల కేంద్రంలోని మణుగూరు క్రాస్రోడ్లో మంగళవారం ఉదయం చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏలూరు నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్తున్న చేపల లోడు లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో లారీలోని చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు చేపలను ఎత్తుకెళ్లారు.
లారీ నిండా లోడు చేసి తీసుకువచ్చిన చేపలన్నీ అరగంటలోనే మాయమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసి ప్రమాదానికి గల కారణాలను డ్రైవర్ను అడిగి తెలుసుకున్నారు.