కారేపల్లి, మార్చి 02 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల సంత గుడి ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కల్యాణ క్రతువు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం వేళ నుండే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణ కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి పుష్పాలతో కల్యాణ మండప ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేశారు. తాళాలు, డోలు వాయిద్యాల శుభ నాదం మధ్య స్వామివారి కల్యాణం వైభవంగా కొనసాగింది. కల్యాణ సమయంలో అర్చకులు స్వామివారి దివ్య గుణాలను, కల్యాణ మహిమలను వివరించారు. కల్యాణానంతరం ఆలయ మండపం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు, వ్యాపారులు, యువకులు, మహిళలు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ కల్యాణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని సేవలందించారు.

కారేపల్లి సంత గుడి ప్రాంగణంలో కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

కారేపల్లి సంత గుడి ప్రాంగణంలో కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం