అశ్వారావుపేట, జనవరి 24 : రైతులకు కొబ్బరి సాగుతో దీర్ఘకాలిక నికర ఆదాయం లభిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగుకు సబ్సిడీ పథకాలు అమలు చేస్తున్నాయని కొబ్బరి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వేల్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత్కుమార్లు తెలిపారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో కొబ్బరి వృక్ష మిత్రులకు చెట్టు ఎక్కే విధానం, పంట సేకరణ, చీడపీడల నివారణ చర్యలపై ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొబ్బరి గెలల సేకరణకు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.
శిక్షణలో భాగంగా వృక్ష మిత్రులకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు జాగింగ్, యోగా, శాస్త్రీయ జ్ఞానం, స్కిట్, డ్రామా, క్షేత్ర దర్పణ వంటి అంశాలు నిర్వహిస్తామని, వీటితో వృత్తి నైపుణ్యం పెంపొందుతుందన్నారు. అనంతరం కొబ్బరి సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు శిరీష, జి.గోపాలకృష్ణమూర్తి, పి.నీలిమ, ఐవీఎస్ రెడ్డి, శ్రావణ్కుమార్, రమేశ్, కోటేశ్వర్, ఝాన్సీరాణి, ఎస్ఎంటీ జంబమ్మ, ఏఈఎల్పీ విద్యార్థులు, అశ్వారావుపేట, పేరాయిగూడెం, నారంవారిగూడెం వృక్ష మిత్రులు పాల్గొన్నారు.