భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా మారాయి. దీంతో మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా అప్గ్రేడ్ అయ్యారు. ఈ ప్రతిపాదన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురుడు పోసుకోగా.. ఎన్నికల నేపథ్యంలో అమలు కాలేదు. ప్రస్తుతం ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో మెయిన్ అంగన్వాడీలుగా మారడంతో టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 1,434 ఉండగా.. మినీ కేంద్రాలు 626 ఉన్నాయి. మొత్తం 11 ప్రాజెక్టుల్లో అంగన్వాడీ సేవలు పిల్లలు, బాలింతలు, తల్లులకు అందుతున్నాయి. తక్కువ కుటుంబాలు, రెవెన్యూ గ్రామాలకు ఆవాసాలు దూరంగా ఉండడం కారణంగా అప్పట్లో(పదేళ్ల క్రితం) మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న తల్లులు, పిల్లలకు ఫీడింగ్తోపాటు ఇమ్యునైజేషన్ కోసం ఏర్పాటు చేసిన ఈ మినీ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో కుటుంబాలు పెరగడంతో ప్రస్తుతం సేవలు చేయడం ఇబ్బందికరంగా మారింది. మినీ అంగన్వాడీ కేంద్రంలో ఆయా, టీచర్ పోస్టును ఒకరే నిర్వహించాలి. కుటుంబాలు సంఖ్య పెరిగిన తర్వాత సేవలు అందించడం ఇబ్బందిగా ఉన్నందున మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని కమిషనర్ దృష్టికి రావడంతో అది ప్రభుత్వ పరిశీలనకు వెళ్లి గ్రీన్సిగ్నల్ పడింది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్వాడీ టీచర్లకు సమ్మె సమయంలో హామీ ఇచ్చారు. కొత్త పీఆర్సీలో వేతనాలు అందరిలాగే పెంచడంతోపాటు మినీలను అప్గ్రేడ్ చేస్తామని ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్న సంగతి తెలిసిందే.
మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ కావడంతో కొత్తగా ఆయాల పోస్టులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మినీ అంగన్వాడీ టీచర్ల జీతం పెరిగింది. ప్రస్తుతం తీసుకుంటున్న జీతం రూ.7,800 కాగా.. ఈ నెల నుంచి రూ.13,650 తీసుకోనున్నారు. దీంతో మినీ టీచర్లలో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఇదేకాక కొత్తగా ఆయా పోస్టులు పెరగడంతో స్థానిక మహిళలు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయా పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం.
మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చడంలో ఆ శాఖ కొన్ని నిబంధనలను విధించింది. గిరిజన ప్రాంతాల్లో 300 కుటుంబాలకు పైగా ఉన్న గ్రామంలో ఉన్న సెంటర్ను ప్రధాన అంగన్వాడీ కేంద్రంగా చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతం, అర్బన్ ఏరియాలో 400 కుటుంబాలు ఉన్న సెంటర్లను ప్రధాన సెంటర్లగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే సర్వే చేసిన సీడీపీవోలు మినీ కేంద్రాల సర్వే రిపోర్ట్ను జిల్లా కార్యాలయానికి పంపగా అక్కడ నుంచి కమిషనరేట్లో పరిశీలన చేసి అప్గ్రేడ్కు అనుమతి ఇచ్చారు.
మినీ అంగన్వాడీ సెంటర్ టీచర్గా చాలా కాలంగా పని చేస్తున్నాను. చాలాసార్లు ధర్నాలు కూడా చేశాం. అందరితో సమానంగా విధులు నిర్వహిస్తున్నాం. కుటుంబాల సంఖ్య కూడా పెరిగింది. మా కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చడం చాలా సంతోషంగా ఉంది. మెయిన్ కేంద్రాలు చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. దీనివల్ల కొత్తగా వచ్చే హెల్పర్లకు ఉపాధి లభించనున్నది.
మినీ అంగన్వాడీ టీచర్లు గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నారు. వాళ్ల సర్వేలో కుటుంబాలు పెరిగాయి. మెయిన్ చేయమని అడిగారు. సంఘాలు కూడా వినతిపత్రాలు ఇచ్చారు. గతంలో ప్రభు త్వం నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం వారికి తీపి కబురు అందించింది. వారందరిని మెయిన్గా మార్చారు. జీవో వచ్చింది. జనవరి నెలకు సంబంధించి పెరిగిన జీతం వారికి వస్తుంది. ఆయా కేంద్రాల్లో హెల్పర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. వాటిని త్వరలో భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం.