ముదిగొండ, మార్చి 25: కిడ్నాపులు, హత్యాయత్నాలకు పాల్పడే మాఫియా ముఠాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు కోరారు. ఇటీవల కిడ్నాప్నకు గురైన పండ్రేగుపల్లి సర్పంచ్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు పాము సిల్వరాజును ఆదివారం ఆయన పరామర్శించారు. మండలంలోని పుడ్రేగుపల్లి గ్రామంలోని సిల్వరాజు నివాసానికి వెళ్లిన ఆయన.. కిడ్నాప్ ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సిల్వరాజు, అతడి కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమల్రాజు మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే సిల్వరాజును కిడ్నాప్ చేయడం హేయమని, ఇలాంటివి పిరికిపంద చర్యలని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు సాధ్యమైనంత వరకు న్యాయమే చేస్తారని, అయినప్పటికీ తమకు న్యాయం జరగలేదనే సాకుతో వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.
ఇలాంటి చర్యలకు పాల్పడే ముఠాల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, వారి వెనుక ఉన్న వారిని కూడా కఠినంగా శిక్షించాలని కోరారు. సిల్వరాజు కిడ్నాప్ ఘటనలో పోలీసుల స్పందన అభినందనీయమని, అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ ఘటనపై నిందితులను అరెస్టు చేయాలని, వారికి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు బలమని, వారికి ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకటేశ్వర్లు, తోట ధర్మారావు, పచ్చ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.