బోనకల్లు, మే 21 : బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మధిర నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. రావినూతల గ్రామంలోని మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ స్వగృహంలో గురువారం మండల పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ అధినేత కేసీఆర్ డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు.
పార్టీ అభివృద్ధి కోసం ముందుకొచ్చి నిబద్ధతతో సభ్యత్వం తీసుకున్న వారే నిజమైన కార్యకర్తలని, వారంతా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. గత ఎన్నికల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 72 వేల ఓట్లు వచ్చాయని, అప్పుడు 50 వేల సభ్యత్వాలు చేర్పించామని, ఓటర్లు ఇంకా మనవైపే ఉన్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు.
ఇటీవల చింతకాని మండలం పాతర్లపాడులో మొక్కజొన్న అగ్నికి ఆహుతి అయినా.. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఆ రైతులకు పరిహారం అందించలేదంటే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతుల పక్షాన నిలిచి, పార్టీ అభివృద్ధి కోసం ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని ఆయన కోరారు. నాయకులు వేమూరి ప్రసాద్, ఇటికాల శ్రీనివాసరావు, పారా ప్రసాద్, కాకాని శ్రీనివాసరావు, వడ్డే నరేశ్, బంధం నాగేశ్వరరావు, గద్దల వెంకటేశ్వర్లు, కొమ్మినేని ఉపేందర్, తొండపు వేణు, జర్రిపూతల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.