లక్ష్యాలను సాధించి ఆదర్శంగా నిలవాలి
క్షిపణులు తయారు చేస్తున్న ఆరు దేశాల్లో ఇండియా ఒకటి
యువత సాధికారత సదస్సులో డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి
సత్తుపల్లిలో ఆసుపత్రి రెసిడెన్షియల్ బ్లాక్కు శంకుస్థాపన
పాల్గొన్న ట్రస్టు ఫౌండర్ చంద్రభాను, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి రూరల్, నవంబర్ 29: యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకు కృషిచేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎంఆర్ గార్డెన్స్లో డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన యువత సాధికారత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజల్వన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమన్నారు. రానున్న పదేళ్లలో భారతదేశం ఉన్నత స్థితికి చేరుకుంటుందని అన్నారు. ఇప్పటికే క్షిపణి తయారీలో ఆరు దేశాల్లో భారత్ ఒకటని, యుద్ధవిమానాలు, మిసైల్స్, శత్రుదేశ క్షిపణి, ప్రత్యేక ఆయుధాల తయారీలో భారతదేశ శక్తి ఎంతో గొప్పగా ఉందని అన్నారు. ప్రతిఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, ఆ నైపుణ్యాన్ని గుర్తించి లక్ష్యాలను సాధించుకోవాలని అన్నారు. కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈవో జ్యోతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఏదైనా చేయాలనుకుంటే దానిని సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీఆర్డీవో డైరెక్టర్ శివప్రసాద్, ఇండియన్ ఫౌండర్ సీఈవో నరేశ్, వైస్ ప్రెసిడెంట్ మార్టిగేజ్ ఆపరేషన్స్ నవీన్ కందూరి, నోబుల్ ఫ్యామిలీ చైర్మన్ రాజ్నాథ్రెడ్డి, డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ చైర్మన్ దూరపనేని హరినాథ్లతోపాటు కళాశాలల యజమానులు జీవీ లింగారెడ్డి, కూసంపూడి మధు, గాదె నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
నిరుపేదల కోసమే ఆసుపత్రి ..
నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకే శ్రీషిరిడీసాయి జనమంగళం ట్రస్టు ఆధ్వర్యంలో ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో శ్రీషిరిడీసాయి జనమంగళం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించబోయే ఆసుపత్రి, దేవాలయ నిర్మాణ ప్రాంగణంలో రెసిడెన్షియల్ బ్లాక్కు గురూజీ, ట్రస్టు ఫౌండర్ చంద్రభాను సత్పతి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి సతీశ్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులిచ్చిన 20 ఎకరాల సువిశాల భూమిలో గ్రామీణ వాతావరణంలో ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం కలిగించేందుకు దేవాలయం, 250 బెడ్ల ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. ముందుగా అతిథులుగా విచ్చేసిన గురూజీ, చంద్రభాను సత్పతి, సతీశ్రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వేదమంత్ఛ్రోరణలతో శాస్ర్తోక్తంగా శంకుస్థాపన చేశారు. గురూజీ చంద్రభాను సత్పతి, డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డిను శాలువాలతో సత్కరించారు. తొలుత ఆయన గురూజీ నుంచి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ, ఆసుపత్రి ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రవేశద్వారాన్ని వారు ప్రారంభించారు. సర్పంచ్ దేశిరెడ్డి రంగారెడ్డి, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమావతీ శంకర్రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఎంపీటీసీలు తుమ్మూరు కృష్ణారెడ్డి, విస్సంపల్లి వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు మందపాటి వెంకటరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.