ఖమ్మం సిటీ, మార్చి 7: నేడు ప్రపంచ మహిళా దినోత్సవం. ఈ ఒక్కరోజు జనులంతా అనేక వేదికల సాక్షిగా ఆడబిడ్డలను వేనోళ్లా కొనియాడుతుంటారు. ఆ తర్వాత షరా మామూలే. కానీ, సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచన చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ గడ్డపై పుట్టిన ఆడబిడ్డలకు అండగా నిలువబోతున్నారు. ఇల్లాలి ఆరోగ్య ప్రాముఖ్యతను గుర్తెరిగి ముప్పై ఏండ్లు దాటిన ప్రతిఒక్కరికీ పండంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించారు. దీనిలో భాగంగా ‘ఆరోగ్య మహిళ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారంలో ప్రతీ మంగళవారం మహిళలకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేయడం, వైద్య సేవలు అందించాలని నిర్ణయించడం గమనార్హం. దీంతోపాటు వ్యాధి తీవ్రత ఆధారంగా ఏడాది పొడవునా జిల్లా కేంద్రాలకు లేదా హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయనున్నారు. కాగా, చరిత్రాత్మక ప్రక్రియను బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించిన వెంటనే.. జిల్లాల్లోనూ ప్రారంభోత్సవాలు మొదలుకానున్నాయి.
‘ఆరోగ్య మహిళ’ అనే అద్భుత కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించనున్నారు. జిల్లాలోని మహిళా వైద్యులు కొలువున్న ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తొలుత అమలు చేస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో మంచుకొండ, వైరా నియోజకవర్గంలో వైరా, మధిర నియోజకవర్గంలో బోనకల్లు, ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి, పాలేరు నియోజకవర్గంలోని ఎంవీ పాలెం, సత్తుపల్లి నియోజకవర్గంలో చెన్నూరు పీహెచ్సీల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.