– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు
కారేపల్లి, సెప్టెంబర్ 11 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు, పేదలే తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కారేపల్లి మండలం మాణిక్యరంలో శుక్రవారం జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకిచ్చిన అనేక హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీల అమలుకు ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి విఫలమైనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశంలో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను ఐక్యం చేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆద్వర్యంలో ఆందోళనలు, పోరాట కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు యనమనగండ్ల రవి, కేసగాని ఉపేందర్, పండగ కొండయ్య, కరపట్టి సీతారాములు, పోతర్ల నాగేశ్వరరావు, చల్ల మల్లమ్మ, భూక్య రమేశ్, పాయం వెంకన్న, షేక్ సైదులు, దాసరి మల్లయ్య, పాసిని నాగేశ్వరరావు, అన్నారపు కృష్ణ, పోతురాజు చందర్రావు, రేమల్ల వీరస్వామి, కరపటి అరుణ, ఈసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.