పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాల నుంచి వలసొచ్చిన కూలీలు చిత్రహింసలకు గురవుతున్నారు. పల్లెల్లో పుడుతున్న వదంతులు వారిపాలిట శాపంగా మారాయి. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠా సంచరిస్తున్నట్లు ఇటీవల పుకార్లు ఎక్కువకావడంతో వలసకూలీల బతుకులు దయనీయంగా మారాయి. సోషల్మీడియా ద్వారా ఈ వదంతులు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
దీంతో ఇతర రాష్ర్టాల వారు కనిపిస్తే చాలు అనుమానంతో దాడులకు పాల్పడుతున్నారు. నాలుగురోజుల క్రితం ఖమ్మంరూరల్ మండలం గుదిమళ్ల గ్రామంలో ఓ వ్యక్తిని స్థానికులు చావబాదిన ఘటన మరువకముందే కూసుమంచి మండలం పోచారంలో మరో ఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని పశ్చిమబెంగాల్కు చెందిన వ్యక్తిని కొట్టడానికి గ్రామస్తులు సిద్ధమవ్వగా ఓ వ్యక్తి చొరవచూపి అతడిని పోలీసులకు అప్పగించాడు. ఏదేమైనా ఈ వరుస ఘటనలతో వలసకూలీలు భయంతో వణికిపోతున్నారు.
కూసుమంచి, ఫిబ్రవరి 17 : తమ రాష్ర్టాల్లో పనులు లేక బతుకుదెరువు కోసం వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు నానాతంటాలు పడుతున్నారు. ప్రతి సంవత్సరం మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్కు చెందిన వేలాదిమంది కూలీలు మన రాష్ర్టానికి వలసవస్తున్నారు. అయితే వీరు ఉంటున్న ప్రదేశం నుంచి పొరపాటున ఇతర గ్రామాలకు వెళ్తేచాలు పిల్లలను ఎత్తుకెళ్లేవారనే అనుమానంతో ప్రజలు చిత్రహింసలు పెడుతున్నారు. ఇటీవల ఖమ్మంరూరల్ మండలం గుదిమళ్ల గ్రామంలో ఓ వలసకూలీని చితకబాదిన విషయం విదితమే. ఈ ఘటన మరువకముందే కూసుమంచి మండలం పోచారం గ్రామంలో రెండ్రోజుల క్రితం మరో ఘటన చోటుచేసుకున్నది. పశ్చిమబెంగాల్కు చెందిన ఓ మతిస్థిమితం లేని వ్యక్తిని కొట్టేందుకు స్థానికులు సిద్ధవ్వగా ఓ వ్యక్తి చొరవతో ప్రమాదం తప్పింది.
మధ్యప్రదేశ్ నుంచి శివరాంసింగ్ అనే వ్యక్తి ముదిగొండ మండలం పండ్రేగిపల్లిలోని ఓ క్రషర్లో పని చేయడానికి వలసొచ్చాడు. గురువారం పనిమీద ఖమ్మం వెళ్లిన అతడు సాయంత్రం పండ్రేగిపల్లి వెళ్లేందుకు ఆటోఎక్కాడు. అయితే ఆ ఆటో పండ్రేగిపల్లి వెళ్లదని చెప్పి అతడిని గుదిమళ్లలో దింపివేశాడు ఆటోడ్రైవర్. ఈక్రమంలో తెలుగురాని శివరాంసింగ్ ఓ మహిళను అడ్రస్ అడిగాడు. దీంతో ఆ మహిళ భయపడి.. పిల్లలను ఎత్తుకెళ్లే దొంగగా భావించి దొంగా దొంగా అని కేకలు వేసింది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వచ్చి ఆ వ్యక్తిని చితకబాదారు. తీవ్రగాయాలైన సింగ్ అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కాలినడకన శుక్రవారం కూసుమంచి మండలం పోచారం గ్రామానికి వెళ్లాడు. అతడి మానసిక పరిస్థితి బాగలేని కారణంగా గ్రామంలోని ఓ కాలనీలో చెట్లపొదల మధ్య కూర్చొని ఉన్నాడు. అతడిని గమనించిన కొందరు అనుమానంతో దొంగగా భావించి కేకలు వేశారు. తెలుగు రాకపోవడం, సమాధానం సరిగా చెప్పకపోవడంతో అతడిని కొట్టేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఈక్రమంలో గ్రామస్తుడొకరు చొరవ తీసుకొని అతడిని కొట్టవద్దని, పోలీసులకు అప్పగించాలని సూచించడంతో డయల్ 100కు కాల్ చేశారు.
పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని స్టేషన్కు తీసుకెళ్లి ఆరాతీయగా పశ్చిమబెంగాల్కు చెందిన ప్రదీప్గా గుర్తించారు. అతడు మతిస్థిమితం లేక గత కొంతకాలంగా కూసుమంచి, పాలేరు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి చొరవతో తృటిలో ప్రమాదం తప్పింది. అయితే ఈ ముసుగులోనే పలు నేరాలకు పాల్పడుతున్న వారూ లేకపోలేదు.. అయితే ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండడంతోపాటు కొంచెం లౌక్యం, ధైర్యంతో ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరకకమానదు.