ఖమ్మం రూరల్, మే 25 : ఖమ్మం రూరల్ మండలంలోని దారేడు గ్రామానికి చెందిన సిపిఐ కార్యకర్త షేక్ ఇమామ్ (45) ఖమ్మం నగరంలో రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ 24న ఎండ తీవ్రతకు గురై అస్వస్థత చెందగా రాత్రి సమయంలో ఇంటి వద్ద మృతి చెందాడు. సోమవారం విషయం తెలిసిన సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేశ్ మృతదేహాన్ని సందర్శించి ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కూలీ షేక్ ఇమామ్ వడదెబ్బతో మృతి చెందడం అత్యంత బాధాకరం అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి న్యాయం చేయాలని కోరారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సర్పంచ్ వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు బత్తిని సీతారాములు, షేక్ నూర్షా, షేక్ మీరా, చిన్నప్ప, సుభాని, షేక్ నూరుద్దీన్, షేక్ జాఫర్, పీరుదోస్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.