భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : దేశం మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా స్పష్టం చేశారు. తెలంగాణ మరోసారీ బీఆర్ఎస్సే సత్తా చాటుతుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాచికలు పారవని, అది ఎన్ని ఎత్తులు వేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది గులాబీ జెండాయేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎన్నికపై అనర్హత కేసులో ఇటీవల సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం విదితమే. అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించిన అనంతరం గురువారం తొలిసారిగా కొత్తగూడెం చేరుకున్న ఎమ్మెల్యే వనమాకు.. అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు సుజాతనగర్ మండలం నాయకులగూడెం వద్ద ఘన స్వాగతం పలికారు. డప్పు చుప్పుళ్లు, బైక్ ర్యాలీలు, గులాబీ జెండాలతో కొత్తగూడేనికి తోడ్కొని వచ్చారు.
అక్కడ అభిమానులు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్షోలో ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ హాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. కొత్తగూడెం అభివృద్ధికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆయన సహకారంతో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ప్రజలు తనకే ఓటు వేసి గెలిపించారని, న్యాయం తన వైపే ఉందని అన్నారు. సుప్రీం కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నానని అన్నారు. ముర్రేడు వాగుకు రిటైనింగ్ వాల్కు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కంచర్ల చంద్రశేఖరరావు, కాపు సీతాలక్ష్మి, సోనా, శాంతి, విజయలక్ష్మి, మండే వీరహనుమంతురావు, బత్తుల వీరయ్య, వనమా రాఘవేంద్రరావు, రామకృష్ణ, దామోదర్, అన్వర్పాషా, కొత్వాల శ్రీనివాస్, రజాక్, కేకే, వాసు తదితరులు పాల్గొన్నారు.