భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ / పాల్వంచ రూరల్, నవంబర్ 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో సోమవారం ఇంటర్ సొసైటీ లీగ్ క్రీడలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రస్థాయిలో భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ నెల 28నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నాలుగురోజుల పాటు ఈ క్రీడలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3వేలకు పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఆర్చరీ, అథ్లెటిక్స్, హాకీ, ఫుట్బాల్, హ్యాండ్బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నీకాయిట్, రన్నింగ్, బాక్సింగ్, రెజ్లింగ్ తదితర క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. అండర్ 14, 17, 19 బ్యాచ్లుగా 13 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు జరుగనున్నాయి.
బీసీ వెల్ఫేర్, ముస్లిం మైనార్టీ, గిరిజన సంక్షేమం, గిరిజన గురుకులాలు, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఏకలవ్య, జనరల్ స్కూల్స్ నుంచి విద్యార్థులు పోటీల్లో పాల్గొననున్నారు. క్రీడాకారులు ఇప్పటికే కిన్నెరసానిలోని క్రీడా మైదానానికి చేరుకున్నారు. సిబ్బంది, పీఈటీలతో కలిపి మొత్తం 5వేల మంది కిన్నెరసాని స్పోర్ట్స్ మీట్కు వచ్చేశారు. గతంలో 5 లీగ్లు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్వహించారు. ఈసారి తొలిసారిగా భద్రాచలం ఐటీడీఏ పరిధిలో కిన్నెరసానిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయా సొసైటీల పరిధిలో నిర్వహించిన పోటీలు చివరి దశకు చేరడంతో ఇక్కడ ఫైనల్ పోటీలు జరుగనున్నాయి. ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, డీడీ రమాదేవి క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లు పూర్తి చేశారు. పోటీల్లో పాల్గొననున్న బాలు రకు అనుబోస్ కాలేజీలో, బాలికలకు కిన్నెరసాని స్పోర్ట్స్ జూనియర్ కాలేజీలో వసతి కల్పించారు. పీఈ టీలు 300, రిఫరీస్ 148, కోచ్లు 50 మంది చేరుకున్నారు.
హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఇంటర్ సొసైటీ ద్వారా నిర్వహించే ఈ పోటీలకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియానాయక్తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
సందడిగా మారిన కిన్నెరసాని
పాల్వంచ మండలం కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ క్రీడాకారులతో సందడిగా మారింది. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో జిల్లాస్థాయి లీగ్లో గెలిచిన క్రీడాకారులు ఫైనల్లో పోటీపడనున్నారు. కప్ను గెలుచుకునేందుకు ఆటగాళ్లు సత్తా చాటనున్నారు. పాల్వంచ నుంచి కిన్నెరసాని వరకు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పండుగ వాతావరణం నెలకొంది.
అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇంటర్ సొసైటీ లీగ్ క్రీడల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రీడలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం. వసతి, ఆహారం, వైద్యం, తాగునీరు తదితర సదుపాయాలు కల్పించాం. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– రమాదేవి, ట్రైబల్ వెల్ఫేర్, డీడీ