కొత్తగూడెం సింగరేణి, జనవరి 3 : 11వ వేతన ఒప్పం దం కొల్కత్తాలో మంగళవారం జరిగిన 8వ సమావేశంలో రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఎంజీబీ (మినిమం గ్యారెంటీ బెనిఫిట్)పై స్పష్టత రాలేదు. పదో వేజ్బోర్డు పూర్తై రెండున్న సంవత్సరాలు గడుస్తున్నా 11వ వేజ్బోర్డు ఒప్పందం ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఇప్పటివరకు ఎనిమిది సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా కోలిండియా యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలు కోరినా ఎంజీబీపై క్లారిటీ ఇవ్వలేదు. 50శాతం జాతీయ కార్మిక సంఘాలు ఎంజీబీపై డిమాండ్ చేయగా కోలిండియా యాజమాన్యం మూడు శాతం నుంచి మొదలుపెట్టి 19 శాతం వరకు ఇచ్చేందుకు అంగీకరించాయి. దీంతో జాతీయ కార్మిక సంఘాలు 20 శాతానికి తగ్గేదే లేదంటూ ఎంజీబీపై స్పష్టత వచ్చిన తరువాతనే మిగతా డిమాండ్లపై చర్చిస్తామని తెలిపారు.
కోలిండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ పాల్గొనగా సిల్ నుంచి డైరెక్టర్(పా) వినయ్ రంజన్, డైరెక్టర్(ఫైనాన్స్, టెక్నికల్) వీరారెడ్డి, బీసీసీఎల్ సీఎండీ సమిరన్ దత్తా, ఎస్ఈసీఎల్ సీఎండీ సీఎస్ మిశ్రా, ఈసీఎల్ సీఎండీ ఏపీ పాండా, సీసీఎల్ సీఎండీ పీఎం ప్రసాద్, డబ్ల్యూపీఎస్ సీఎండీ మనోజ్కుమార్, ఎన్సీఎల్ సీఎండీ బోలాసింగ్, ఎంసీఎల్ డైరెక్టర్ కేశవరావు, సిల్ ఈడీ ఫైనాన్స్ సునిల్కుమార్ మెహ్రా, సిల్ ఈడీ పర్సనల్ అజయ్కుమార్ చౌదరి, సింగరేణి నుంచి అధికార ప్రతినిధి జీఎం పర్సనల్ ఆనందరావు, జాతీయ కార్మిక సంఘం నాయకులు ఏఐటీయూసీ నుంచి రామేంద్రకుమార్, సీతారామయ్య, సీఐటీయూ నుంచి రామానందన్, మందా నర్సింహారావు, హెచ్ఎంఎస్ నుంచి నాదులాల్పాండే, రియాజ్ అహ్మద్, బీఎంఎస్ నుంచి లక్ష్మారెడ్డి, మాధవ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.