దేశానికి రైతే వెన్నెముక. రైతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. రైతుల జోలికొస్తే కన్నెర్ర చేస్తున్నది. అన్నదాతల అవసరాలను ఆసరాగా చేసుకొని మోసం చేయాలని చూసే అక్రమ వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. వానకాలం సీజన్ సమీపిస్తుండడంతో నకిలీల భరతం పట్టేందుకు టాస్క్ఫోర్స్ను రంగంలోకి దింపింది. మేలైన విత్తనాలు, ఎరువులనే విక్రయించేలా చర్యలు చేపట్టింది. ఈ విషయాలపై డీలర్లు, రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఈ ఏడాది నూతన విధానాన్ని అమలు చేస్తున్నది. ఎరువులు, విత్తనాల స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఏదేమైనా కర్షకులకు నష్టం కలిగించే వారెవరైనా జైలుపాలుకాక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, మే 20 (నమస్తే తెలంగాణ) : నకిలీ విత్తనాల విక్రయాలకు రాష్ట్ర సర్కారు అడ్డుకట్ట వేస్తున్నది. రైతులు వ్యాపారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు టాస్క్ఫోర్స్ను రంగంలోకి దింపింది. పోలీస్ అధికారులు, వ్యవసాయాధికారులతో కూడిన బృందం ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏరాటు చేసి ప్రత్యేక ఫోన్నంబర్ను అందుబాటులో ఉంచారు.
విత్తనాలకు పెరిగిన డిమాండ్
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విత్తనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో వివిధ కంపెనీల పేర్లతో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి కొత్త స్టిక్కర్లతో వచ్చేస్తున్నాయి. అధిక లాభాలకు ఆశపడి పలుచోట్ల డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా వాటిని రైతులకు విక్రయిస్తున్నారు. దీంతో పంట సాగు చేసిన అన్నదాతలు ఆశించిన మేరకు దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వానకాలం సీజన్ నుంచి విత్తన డీలర్లు ఏయే ఎరువులు విక్రయిస్తున్నారు.? స్టాక్ ఎంత ఉంది.? ఎవరికి విక్రయించారు.? రశీదు నంబర్? లాంటివి ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఆన్లైన్ నమోదు ప్రక్రియపై డీలర్లకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం వారి పనితీరును పర్యవేక్షించేందుకు టాస్క్ఫోర్స్ టీంను కూడా సిద్ధం చేసింది. ఇప్పటినుంచి అన్నదాతలను మోసం చేసే వారు ఎవరైనాసరే ఊరుకునేది లేదని ప్రభుత్వం సీరియస్గా ఉంది.
గతంలో కేసులు ఇవిగో..
జిల్లావ్యాప్తంగా గతంలో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. బూర్గంపాడు మండలం అంజనాపురంలో 3 కిలోల మిర్చి విత్తనాలు విక్రయిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేశారు. పినపాక మండలంలో అనుమతులు లేకుండా విక్రయిస్తున్న డీలర్పై కేసు నమోదు చేశారు. టేకులపల్లి మండలంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న డీలర్పై కూడా కేసు నమోదైంది. ఇల్లెందు, జూలూరుపాడు మండలాల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న డీలర్లపై కేసులు నమోదు చేసి షాపులను సీజ్ చేశారు.
ఫిర్యాదుల కోసం ప్రత్యేక నంబర్
రైతులకు ఎలాంటి సమస్య వచ్చిననా వెంటనే ఫోన్ చేసేందుకు అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఫోన్నంబర్ను అందుబాటులో ఉంచారు. 7288894276 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదులు చేస్తే వారి పేరు గోప్యంగా ఉంచి డీలర్పై చర్యలు తీసుకుంటారు.
కొత్త విధానం అమలుకు సన్నాహాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, పొద్దుతిరుగుడు తదితర పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. ప్రతి వానకాలం సీజన్లో పంటల సాగు పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది నుంచి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఇందుకోసం రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువుల వివరాలు, స్టాక్ నంబర్ పంపిణీ, రశీదు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలి. తద్వారా ఏ డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేశారనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు మొలకెత్తకపోయినా, దిగుబడి రాకపోయినా డీలర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. విత్తన ప్యాకెట్లపై సరైన పేరు, గడువు తేదీ, బార్కోడ్ లేని వాటిని కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పకుండా బిల్లులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమతులు లేకుండా విత్తనాలు విక్రయిస్తే పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
పక్కరాష్ర్టాల నుంచి వచ్చే అవకాశం
నకిలీ విత్తనాలను పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చి విక్రయిస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. వారి నుంచి తస్మాత్ జాగ్రత్త అని అధికారులు రైతులను హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నకిలీ విత్తనాలు పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి వచ్చే అవకాశం ఉన్నందున వాటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కేసులు నమోదైన డీలర్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
పకడ్బందీ చర్యలు
నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న వర్షాకాలం సీజన్లో నకిలీ విత్తనాల అడ్డుకట్టకు ఇప్పుడే చర్యలు చేపడుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. పంటల సాగు విషయంలో విత్తనాలను పునాదిగా భావించి నాణ్యమైన విత్తనాలను రైతులకు ప్రభుత్వపరంగా, ప్రైవేట్పరంగా అందించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులందరికీ నాణ్యమైన విత్తనాలను అందించేందుకు సర్కార్ నూతన విధానాన్ని అమలు చేస్తుండగా.. ఇందులో ముఖ్యంగా విత్తనాల డీలర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎరువులు, విత్తనాల స్టాక్ వివరాలు ఆన్లైన్లో నమోదుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్నదాతలకు నష్టం కలిగించే వారెవరినైనా క్షమించేది లేదని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంతటివారైనా వదిలేది లేదు..
రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్నారు. డబ్బు ఆశ కోసం రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు. ఎంతటి వారైనా వదిలేది లేదు. పీడీ యాక్టు నమోదు చేస్తాం. లైసెన్స్ రద్దు చేసి జైలుకు పంపిస్తాం. టాస్స్ఫోర్స్ బృందం నిరంతరం తనిఖీలు చేస్తున్నది. అన్ని మండలాల్లో డీలర్లు, రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– కొర్సా అభిమన్యుడు, జిల్లా వ్యవసాయాధికారి