ఖమ్మం రూరల్, ఆగస్టు 26: ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలని ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి పిలుపునిచ్చారు. రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ బెల్లం ఉమ అధ్యక్షతన గణేశ్ ఉత్సవాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు గ్రామాల్లో మండపాల సంఖ్య, ఉత్సవ కమిటీ సభ్యుల ఫోన్ నంబర్లను సేకరించాలని సూచించారు. మండపాలను ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీజేలకు అనుమతి లేదన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు నిబంధనలను అతిక్రమించరాదన్నారు. వచ్చే నెల10 తేదీన గణేష్ నిమజ్జనం ఉంటుందన్నారు.
అధికారులు నిమజ్జన వాహనాలు, డ్రైవర్ వివరాలు సేకరించాలన్నారు. లైసెన్స్ ఉండి అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నిమజ్జన ఊరేగింపునకు తీసుకోవాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎంపీపీ బెల్లం ఉమ మాట్లాడుతూ.. మండపాల పరిసరాలను కమిటీ సభ్యులు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అందుకు పంచాయతీ సిబ్బందిని వినియోగించుకోవచ్చన్నారు. అనంతరం నాయుడుపేట వైపు మున్నేరు ఒడ్డు వద్ద విగ్రహాల నిమజ్జన స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రదేశంలో 20 వాహనాలు పార్కింగ్ చేసే విధంగా మైదానం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఏసీపీ సూచించారు. సమావేశంలో ఎంపీడీవో అశోక్కుమార్, తహసీల్దార్ సుమ, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎంపీఈవో శ్రీనివాసరావు, పెద్దతండా స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, విద్యుత్, వైద్యారోగ్య, ఆర్అండ్బీశాఖ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.