ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 22 : ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువేనని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేందుకు కృషిచేశానని, ఇందుకోసం ఈ రెండు దఫాల్లో పార్లమెంట్లో గట్టిగా కొట్లాడానని, భవిష్యత్లోనూ ఇందుకోసం రైతుల పక్షాన పోరాడుతానని తేల్చిచెప్పారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను సోమవారం సందర్శించిన ఆయన.. పత్తి, మిర్చియార్డులో విస్తృతంగా పర్యటించారు. రైతులు, కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషనర్ సిఫార్సులను అమలు చేయాలని, రైతులకు మద్దతు ధర అందించాలని పార్లమెంట్లో అలుపెరగని పోరాటం చేశామని అన్నారు. అయినప్పటికీ డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్, బీజేపీలు మాట్లాడడం లేదని, ఈ రెండు రైతు వ్యతిరేక పార్టీలేనని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ గెలిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. అందుకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినైన తనను గెలిపించాలని కోరారు. ఏఎంసీ మాజీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, వర్తక సంఘం బాధ్యులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, మాటేటి నాగేశ్వరరావు, ఎడ్లపల్లి సతీశ్, జీవై నరేశ్, కోలేటి నవీన్, వాసు, తాళ్లూరి శ్రీనివాస్, చీకటి రాంబాబు, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.