ఖమ్మం, ఆగస్టు 26: తెలంగాణలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం మొదటి వరుసలో ఉన్నందున మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడంలోనూ ముందు ఉండాలని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ ఆకాంక్షించారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడంలో స్తంభాద్రి ఉత్సవ సమితి సభ్యులు ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. నగరంలో గణేశ్ నవరాత్రులను సజావుగా, ఆనందంగా జరుపుకునేందుకు కేఎంసీ పాలకవర్గం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేశ్ మండపాల నిర్వాహకులతో నగరంలోని వర్తక సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మేయర్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ముందుకు రావాలని, మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసే వారికి కలెక్టర్ ప్రోత్సాహక బహుమతులు ఇస్తారని అన్నారు. కేఎంసీ తరఫున 6 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని, సీఎంఆర్ షాపింగ్ మాల్ తరఫున మరో 5 వేల మట్టి విగ్రహాలను ఉచితంగా అందిస్తారని అన్నారు.
నగరంలో భక్తులు ఏర్పాటు చేసుకునే ప్రతి మండపాన్నీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ మాట్లాడుతూ ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆధ్వర్యంలోని మమత సొసైటీ, పువ్వాడ ఫౌండేషన్ ద్వారా ప్రతి మండపానికీ విద్యుత్, మైకు చార్జీలను ప్రభుత్వానికి జమ చేస్తారన్నారు. నిమజ్జనం జరిగే రోజున ఉదయం 10 గంటలకు శోభాయాత్రను ప్రారంభించాలన్నారు. ఏసీపీ ఆంజనేయులు, ఏసీపీ రామోజీ రమేశ్ మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని అన్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దన్నారు. ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు వెంపటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్తంభాద్రి ఉత్సవ సమితి గడిచిన 35 ఏళ్లుగా ప్రభుత్వానికి, మండపాల నిర్వాహకులకు మధ్య వారధిగా పనిచేస్తోందని గుర్తుచేశారు. సహకరిస్తున్న మంత్రి పువ్వాడకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అధ్యక్షుడు వినోద్ లాహోటి మాట్లాడుతూ ఉత్సవ కమిటీ సభ్యత్వం పొందిన మండపాలకు మాత్రమే ఉచిత విద్యుత్ ఉంటుందన్నారు. స్తంభాద్రి ఉత్సవ సమితి బాధ్యులు కన్నం ప్రసన్నకృష్ణ, అల్లిక అంజయ్య, ములుగుండ్ల శ్రీహరి, డోలే సాయికిరణ్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, సీఐలు అంజలి, అశోక్, శ్రీధర్, రామకృష్ణ, కార్పొరేటర్లు, నాయకులు పసుమర్తి రామ్మోహన్ రావు, వేల్పుల సుధాకర్, పోతుల చంద్రశేఖర్, దనాల శ్రీకాంత్, గజ్జల వెంకన్న, తోట వీరభద్రం, రుద్రగాని ఉపేందర్, వంగాల వెంకట్, బోజెడ్ల రామ్మోహన్రావు, వల్లభనేని రామారావు, తోట రామారావు, దోన్వాన్ రవి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.