ఖమ్మం, ఏప్రిల్ 9 : శ్రీక్రోధ నామ సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, అనుకున్న కోరికలు, లక్ష్యాలు సిద్ధించి భవిష్యత్ వైపు ముందుకు సాగాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు. ఖమ్మం స్వర్ణభారతి కల్యాణ మండపంలో కమ్మ మహాజన సంఘం నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన ఉగాది వేడుకలకు నామా ముఖ్యఅతిథిగా హాజరై ఉమ్మడి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కరువుతోపాటు అనేక సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, రానున్న రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయ సీజన్ బాగుండాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలన్నారు. అనంతరం నిర్వాహకులు ఎంపీ నామాను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, కమ్మ సంఘం నాయకులు ఎర్నేని రామారావు, స్థానికులు నల్లమల వెంకటేశ్వరరావు, కాటంనేని రమేశ్, మోరంపూడి ప్రసాద్, తన్నీరు రవి, నామా సేవా సమితి నుంచి తాళ్లూరి హరీశ్, రాజేశ్, చీకటి రాంబాబు, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.