వైరాటౌన్, జూన్ 7 : తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వైరాలో బుధవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సాగునీటి దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. తొలుత పట్టణంలో ఎమ్మెల్యే రాములునాయక్ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ, కోలాట బృందాలు, గిరిజన సంప్రదాయాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్ డప్పు వాయిస్తూ గిరిజనులతో కలిసి చిందులు వేశారు. అనంతరం వైరా రిజర్వాయర్ బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దశాబ్దాల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యేకంగా సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారని, రైతాంగం ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చే విధంగా చేసిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మించి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. పదేళ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే కేసీఆర్ ధ్యేయమని అన్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు రాష్ట్రంలో 40వేల చెరువులను పూడిక తీయించారని, రైతు సంక్షేమం కోసం పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
చెరువుల మరమ్మతులకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే రాములునాయక్
వైరా నియోజకవర్గంలో మధ్య, చిన్నతరహా చెరువుల మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. చెరువుల నిర్మాణం కోసం రూ.35.45కోట్ల వ్యయంతో మరమ్మతులు చేపట్టారని, చెరువుల పూడికతీత వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని, వ్యవసాయ అభివృద్ధి గణనీయంగా పెరగడంతోపాటు గతంలో ఎప్పుడూ లేనివిధంగా వైరా రిజర్వాయర్ పరిధిలో రెండు పంటలు పండిస్తున్నారని అన్నారు. దీనికి కారణం కేసీఆర్ కృషే అని అన్నారు. సాగునీటికే కాకుండా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైరా రిజర్వాయర్ నుంచే సుమారు 120 గ్రామాలకు తాగునీటి సరఫరా కూడా నిర్వహిస్తున్నదని అన్నారు. రానున్న రోజుల్లో రైతులు కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు సైనికుల్లా పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో ఐదు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డప్పు కొడుతూ నృత్యం చేసిన ఎమ్మెల్యే
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవం కార్యక్రమంలో ట్రాక్టర్ భారీ ర్యాలీ నిర్వహించారు. వైరాలోని రింగు రోడ్డు సెంటర్లో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ ఏడు పదుల వయస్సులో సైతం కుర్రాడిని తలపిస్తూ డప్పు కొడుతూ గిరిజనులతో కలిసి చిందులు వేశారు. ఆయన ఉత్సాహాన్ని చూసి పలువురు నాయకులు ఆయనతో కలిసి కాలు కదిపారు.