జూలూరుపాడు, అక్టోబర్ 7: రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అందుకని నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాపీ కొట్టి తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రవేశపెడుతున్నాయని విమర్శించారు. జూలూరుపాడు మండలంలో శనివారం పర్యటించిన ఆయన.. స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ మదన్లాల్ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మదన్లాల్ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కి కానుకగా ఇవ్వాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. వైరా నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడుతుందని, తన బావ మదన్లాల్ గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని అన్నారు. మనిషిరూపంలో ఉన్న దేవుడు కేసీఆర్ అని, తెలంగాణకు ఆయనే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మదన్లాల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని అన్నా. వైరా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు.
తొలుత స్థానిక సాయిబాబా దేవాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు నల్లమల వెంకటేశ్వర్లు, యల్లంకి సత్యనారాయణ, వేల్పుల నర్సింహారావు, లావుడ్యా సోని, మూడు చిట్టిబాబు, భూక్యా కళావతి, గాదె నిర్మల, పొన్నెకంటి సతీశ్కుమార్, చౌడం నర్సింహారావు, చావా వెంకటరామారావు, యదళ్లపల్లి వీరభద్రం, దుద్దుకూరి నాగేశ్వరరావు, పోలుదాసు కృష్ణమూర్తి, నున్నా రంగారావు, రోకటి సురేశ్, మల్లెల నాగేశ్వరరావు, సొబ్బని కోటేశ్వరరావు, మోదుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.