బోనకల్లు/ చింతకాని, జూన్ 3:స్వరాష్ట్రంలో సాగు రంగానికి తిరుగులేదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఒకప్పుడు పంటల సాగు చేసుకునేందుకు అప్పుల కోసం వెళ్లిన అన్నదాతలు.. నేడు అదే పంటలను మద్దతు ధరకు విక్రయించి గ్రామాల్లో అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగారని అన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్లనే నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బోనకల్లు మండలం రాయన్నపేటలో శనివారం జరిగిన రైతు దినోత్సవంలో ఎంపీ నామా మాట్లాడారు.
నాటి ఉమ్మడి పాలనలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం రైతులు ధర్నాలు చేసే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. కానీ నేడు స్వరాష్ట్రంలో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే దృశ్యాలు కన్పిస్తున్నాయని అన్నారు.రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు అండగా ఉండి ఆయన మూడోసారీ ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం రైతువేదికలో రైతులతో కలిసి ఎంపీ నామా నాగేశ్వరరావు సహఫంక్తి భోజనాలు చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు నల్లమల వెంకటేశ్వరరావు, బొమ్మెర రామ్మూర్తి, జంగా రవికుమార్, మోరంపూడి ప్రసాద్, చిత్తారు సింహాద్రి, మంకెన రమేశ్, కిన్నెర వాణి, పాపారావు, యంగల మార్తమ్మ, తూము రోశన్కుమార్, కర్ణాటి రామకోటేశ్వరరావు, పద్మలత, సాయి, వల్లెబోయిన కొండలరావు, నాగరాజు, నరేశ్, ఆకుల రేణుక తదితరులు పాల్గొన్నారు.
చింతకానిలో..
చింతకాని మండలం లచ్చగూడెం, చింతకాని, జగన్నాథపురం, నాగులవంచ గ్రామాల రైతువేదికల్లో జరిగిన రైతు దినోత్సవాల్లోనూ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ కృషి వల్లనే రాష్ట్రంలో పంటల దిగుబడులు పెరిగాయని అన్నారు. అనంతరం చింతకాని, జగన్నాథపురం రైతువేదికల్లో రైతులకు భోజనం వడ్డించారు. నాగులవంచ గ్రామంలో రైతులతో కలిసి ఎడ్లబండిపై ప్రదర్శనగా బయలుదేరి రైతువేదికకు వెళ్లారు. ప్రొద్దుటూరు, బస్వాపురం, పందిళ్లపల్లి రైతువేదికల్లోనూ రైతు దినోత్సవాలు జరిగాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.