గ్రీనరీ మధ్య కనిపిస్తున్న ఈ చిత్రం ముదిగొండ నుంచి చెరువు మాధారం వెళ్లే బీటీ రోడ్డు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రహదారి పనులు చేపట్టినా వాటిని సకాలంలో పూర్తి చేస్తున్నది. గడిచిన తొమ్మిదేళ్లలో జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో రాష్ట్రీయ, గ్రామీణ రహదారులను నిర్మించింది. వాహనదారులు, ప్రజలకు అవసరమైన ప్రతిచోటా మెరుగైన రవాణా సదుపాయం కల్పిస్తున్నది.
నిర్మానుష్యంగా ఉండి , పనులు ‘ఎక్కడ వేసిన గొంగడి..’ అన్నట్లు కనిపిస్తున్న ఈ రోడ్డు ‘ఖమ్మం- కోదాడ’ జాతీయ రహదారి. 35 కిలోమీటర్ల మేర జరుగుతున్న ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్డు పొడుగునా ఎక్కడ చూసినా అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు.. నిరుపయోగంగా కనిపించే పైపులే దర్శనమిస్తున్నాయి.. ఎక్కడో ఒక చోట కార్మికులు పని చేస్తూ కనిపిస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ఈ పనులపై ఎన్హెచ్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే ఆలస్యమవుతున్నాయని ప్రజాప్రతినిధులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర రహదారులు శరవేగంగా పూర్తి అవుతుండగా.. జాతీయ రహదారుల పనులు మాత్రం ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. కేంద్రం నిర్లక్ష్య వైఖరితో కాంట్రాక్టర్లు పనులు చేపట్టడంలో జాప్యం చేస్తున్నా.. ఎన్హెచ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా పరిధిలో చేపట్టిన జాతీయ రహదారుల పనులు చకచకా సాగకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి నిర్మాణ పనులపై ఎన్హెచ్ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇప్పటివరకు 85శాతం పనులు మాత్రమే పూర్త య్యాయి. తల్లంపాడుతోపాటు సూర్యాపేట జిల్లా పరిధిలోని మోతె వద్ద వంతెనల పనులు సాగుతున్నాయి. కానీ ఎన్హెచ్ అధికారులు మాత్రం పనులు 95 శాతం పూర్తి చేశామని చెప్పి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. కోదాడ- ఖమ్మం ఎన్హెచ్ 365-ఏ నిర్మాణ పనులు ఇప్పటికీ 40 కూడా శాతం పూర్తి కాలేదు. ఖమ్మం-కురవి ప్రాజెక్టులో నిర్మించనున్న జాతీయ రహదారి నిర్మాణానికి ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయలేదు. ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ఆరంభ దశలోనే ఉన్నాయి. నాగ్పూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే వయా ఖమ్మం జిల్లా నుంచి వెళ్తున్నది. ఈ రహదారి నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి. పనులకు టెండర్లు పిలిచినప్పటికీ ఇప్పటివరకు ఫైనల్ కాలేదు. – ఖమ్మం, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా పరిధిలో చేపట్టిన జాతీయ రహదారుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులను కార్పొరేట్ సంస్థలు రీ టెండర్ విధానంలో చోటామోటా కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నాయి. అసలు టెండర్లు వేసిన కంపెనీలు చేతులు దులుపుకోవడంతో కిందిస్థాయి కాంట్రాక్టర్లు పనులను తమకు నచ్చినప్పుడు చేయిస్తున్నారు. వీరికి తగినట్లే ఎన్హెచ్ అధికారుల పనితీరూ ఉంది. పనుల వివరాలను ప్రజాప్రతినిధులకూ తెలపడం లేదు. వారి మొబైల్ నంబర్లు తెలుసుకుని వారికి కాల్ చేసినా వారి నుంచి స్పందన రావడం లేదు.
రహదారి పూర్తికాకుండానే ‘టోల్’
జిల్లా ప్రజలు హైదరాబాద్ వెళ్లాలంటే సూర్యాపేట మీదుగానే వెళ్లాలి. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎంతో ఒత్తిడి తెచ్చింది. దీంతో కేంద్రం దిగి వచ్చి 2020లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. నిర్మాణానికి రూ.800 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు 85శాతం పనులు పూర్తయ్యాయి. పనులపై ఎన్హెచ్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. తల్లంపాడుతోపాటు సూర్యాపేట జిల్లా పరిధిలోని మోతె వద్ద వంతెనల పనులు నత్తనడకన సాగుతున్నాయి. కానీ ఎన్హెచ్ అధికారులు మాత్రం పనులు 95 శాతం పూర్తి చేశామని చెప్పి వాహనదారుల నుంచి టోల్ వసూల్ చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి సూర్యాపేటలోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారికి అనుసంధానం కావాల్సి ఉన్నది. ఖమ్మం సూర్యాపేట రహదారి సూర్యాపేట పట్టణానికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మార్గం నుంచి వచ్చే వాహనదారులు వాహనాలను హైదరాబాద్ వైపు మళ్లించేందుకు నాలుగు కిలోమీటర్లు వెనక్కి వెళ్లి యూ టర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై ప్రజాప్రతినిధులు ఎన్హెచ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. రహదారి అనుసంధానం అవుతున్న ప్రాంతంలో జంక్షన్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
నత్తనడకన రహదారుల పనులు..