ఖమ్మం, జూన్ 15: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పట్టణ ప్రగతి’తో ఖమ్మం నగర రూపురేఖలు మారిపోయాయి. కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది శిథిలమైన బావులు, ఇండ్లను నేలమట్టం చేశారు. విరిగిన, వాలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. అవసరమైన చోట కొత్తగా ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయించారు. పారిశుధ్య నిర్వహణను పక్కాగా చేపట్టారు. నగరంలో అనేక చోట్ల పార్క్లు అందుబాటులోకి వచ్చాయి. నర్సరీల్లో పకడ్బందీగా మొక్కల పెంపకం జరుగుతున్నది.
అభివృద్ధి పనులు ఇలా..
నగరపాలక సంస్థ పరిధిలో 2014 నుంచి ఇప్పటివరకు సర్కార్ రూ.347.80 కోట్లతో వందలాది కిలోమీటర్ల పొడవునా అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారులు నిర్మించింది. రూ.448.66 కోట్లతో 1,797 కిలోమీటర్ల మేర సైడు కాలువలు నిర్మించింది. రూ.23.89 కోట్లతో నల్లా కనెక్షన్లు ఇచ్చింది. రూ.18 కోట్లతో పారిశుధ్య వాహనాలను సమకూర్చింది. రూ.7.75 కోట్లతో 34,100 వీధి దీపాలు ఏర్పాటు చేసింది. రూ.34.65 కోట్లతో లకారం చెరువును సుందరీకరించి ట్యాంక్ బండ్ నిర్మించింది. రూ.100 కోట్లతో గోళ్లపాడు చానల్ను ఆధునీకరించింది. రూ.21 కోట్లతో నూతన కార్పొరేషన్ కార్యాలయాన్ని నిర్మించింది. వీవీ పాలెం వద్ద రూ.53 కోట్లతో సమీకృత జిల్లా అధికారుల సముదాయం, రూ.30 కోట్లతో బస్టాండ్ నిర్మించింది. మిషన్ భగీరథలో భాగంగా నగరంలో కొత్తగా 34 వాటర్ ట్యాంక్లు, రూ.8.73 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్లు, రూ.105 కోట్లతో డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం, రూ.27.50 కోట్లతో ఐటీ హబ్, రూ.9 కోట్లతో వైకుంఠ ధామాలు, రూ.77 కోట్లతో ధంసలాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించింది.
ఆహ్లాదకరంగా పార్క్లు, ఫౌంటేన్లు..
నగరంలో రూ.కోట్లతో లకారం ట్యాంక్బండ్, కేబుల్ బ్రిడ్జి, బోటింగ్ అందుబాటులోకి వచ్చింది. ఉదయం సాయంత్రం పిల్లలు, పెద్దలు అక్కడ సేదతీరుతున్నారు. ఇల్లెందు క్రాస్ రోడ్డు, కాల్వొడ్డు, మమత రోడ్లోని లకారం పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటేన్లు రా త్రిళ్లు ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నాయి. ఫౌంటేన్ల వద్ద యువత సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జంక్షన్లలో గ్రీనరీ నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. రోటరీ నగర్, వ్యవసాయ మార్కెట్, చర్చ్ కాంపౌండ్, జహీర్పుర పార్కుల్లో చిన్నారులు ఉదయం సాయంత్రం ఆడుకుంటున్నారు.
రాత్రిళ్లు ఎల్ఈడీ కాంతులు..
ఖమ్మం నగరంలో రాత్రిళ్లు ఎల్ఈడీ బల్బులు కాంతులు పంచుతున్నాయి. కాల్వొడ్డు (నగర ముఖద్వారం) నుంచి పీజీ కళాశాల సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం వరకు సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
రూ.4 కోట్లతో నగర సుందరీకరణ..
ప్రభుత్వం రూ.4 కోట్లతో ఖమ్మంలోని అంతర్గత రహదారులను వెడల్పు చేసింది. వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి ఎదులాపురం వరకు 6 లేన్ల క్రాస్రోడ్డు నిర్మించింది. రాపర్తి నగర్ జంక్షన్ నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు, ఎన్టీఆర్ విగ్రహం వరకు డివైడర్ నిర్మించింది. ఇల్లెందు క్రాస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు, ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మంచుకొండ వరకు ఆరు లేన్ల రోడ్లు నిర్మించింది. జడ్పీ సెంటర్ నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు, ఇల్లెందు క్రాస్ రోడ్డు నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకు, జడ్పీ సెంటర్ నుంచి చర్చ్ కాంపౌండ్ సెంటర్ మీదుగా ప్రకాశ్నగర్ బ్రిడ్జి వరకు, ప్రకాష్నగర్ నుంచి వెంకటగిరి క్రాస్ రోడ్డు వరకు 6 లేన్ల రహదారి నిర్మించింది. మయూరి సెంటర్ నుంచి జడ్పీ సెంటర్ వరకు డివైడర్ నిర్మించించింది. వాటి మధ్యలో పూల మొక్కలు నాటించింది. ఇల్లెందు క్రాస్ రోడ్డు, జడ్పీ సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ విగ్రహం వద్ద జంక్షన్లను సుందరీకరించింది.
హైదరాబాద్కు దీటుగా ఖమ్మం అభివృద్ధి..
తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం నగరం ఒకటి. నగర అభివృద్ధి నమూనాను ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక మున్సిపల్ పాలక వర్గాల సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు నగర స్వరూపాన్నే మార్చాయి. ముఖ్యంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవ, కృషితో నగరాభివృద్ధికి దండిగా నిధులు విడుదలవుతున్నాయి.
– ఆదర్శ్ సురభి, నగరపాలక సంస్థ కమిషనర్, ఖమ్మం