భద్రాచలం, జూలై 21: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం బలవర్థకమైన ఆహారం అందిస్తున్నామని ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. మంగళవారం భద్రాచలంలోని ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాలులో మర్యాదపూర్వకంగా కలిసిన ఇక్రిశాట్ నంగియా కంపెనీ డాక్టర్ల బృందం సభ్యులకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల స్థితిగతులు, భద్రగిరి మార్ట్ నెలకొల్పి పూర్తిస్థాయి ఆర్గానిక్ వస్తువులనే ప్రజలకు అందిస్తున్న తీరు గురించి పీవో వివరించారు.
గిరిజన మహిళలు నాణ్యతతో తయారు చేస్తున్న మిల్లెట్ బిసెట్లు లండన్ వరకు ఆన్లైన్లో అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిపారు. మీ సంస్థ ద్వారా న్యూట్రిషన్ ఫుడ్ను దుమ్ముగూడెం, చర్ల, అశ్వరావుపేట మండలాల్లోని జీపీఎస్, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు అందించాలని సూచించారు. ఇక్రిశాట్ నంగియా కంపెనీ బృందం సభ్యులు మాట్లాడుతూ ఇక్రిశాట్ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని ఏడు నుంచి పదేళ్ల పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఇక్కడికి వచ్చామని తెలిపారు.
మధ్యాహ్న భోజన పథకం ద్వారా పోషకాహారం అందించడానికి న్యూట్రిషన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను పరిశీలించామని, రక్తహీనతతో ఉన్న చిన్నారులను గుర్తించి న్యూట్రిషన్ ఫుడ్ అందించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. చిన్నారులందరికీ బలవర్ధకమైన ఆహారం అందించేలా సూచనలిస్తామని పేర్కొన్నారు. డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి చందన, ఏడీఎంహెచ్వో సైదులు, ఇన్చార్జి ఎంఈవో రమ, ఇక్రిశాట్ నంగియా బృందం డాక్టర్లు మాసన్ స్వామికన్నా, రూపా బెనర్జీ, జూడి థామస్, అభినవ్ ఎంసీ పాల్గొన్నారు.