కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 23: ‘పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ పట్టుదలతో చదివితే ఏ పోటీ పరీక్ష అయినా సాధించొచ్చు.. అందుకు పేద, ధనిక భేదం లేదు.. ప్రతిభ, ప్రజ్ఞ ఉన్న ప్రతిఒక్కరూ విజయతీరాలకు చేరుకోవచ్చు’ అని నిరూపించాడు కొత్తగూడెం జిల్లాకేంద్రానికి చెందిన గ్రందే సాయికృష్ణ. మంగళవారం యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో 293 ర్యాంక్ సాధించి జిల్లాఖ్యాతిని ఇనుమడింపజేశాడు. గతంలో మూడుసార్లు సివిల్స్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయినప్పటికీ నిరాశపడకుండా చదివి తానేంటో ఫలితాల ద్వారా చాటి చెప్పాడు. కొత్తగూడెంలోని శ్రీనగర్కాలనీలో సాయికృష్ణ నివాసం. తండ్రి శ్రీనివాస్ పట్టణంలోని ఓ లాడ్జి మేనేజర్. తల్లి నాగలక్ష్మి గృహిణి. మధ్యతరగతి కుటుంబం. వారు ఇప్పటికే అద్దె ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. కుమారుడు సాయికృష్ణ ఇప్పుడు ఆ కుటుంబ స్థితిగతులను మార్చే స్థాయికి ఎదిగాడు.
విద్యాభ్యాసం ఇలా..
సాయికృష్ణ మూడు నుంచి పదోతరగతి వరకు కొత్తగూడెంలోని సూర్యోదయ పబ్లిక్ స్కూల్, ఇంటర్మీడియట్ విజయవాడలోని శ్రీగాయత్రి జూనియర్ కాలేజీ, బీటెక్ కేరళలోని కాలికేట్ నగరంలోని ఎన్ఐటీలో పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎల్అండ్టీ కంపెనీలో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి బయటకు వచ్చాడు. యూపీఎస్సీ సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి శిక్షణ లేకుండా రోజుకు సుమారు 10 గంటల చొప్పున మూడేళ్లు కష్టపడి చదివాడు. యూపీఎస్సీ పాత ప్రశ్నపత్రాలు, ఆన్లైన్లో మోడల్ పేపర్స్తో స్వయంగా మాక్ టెస్ట్లు పెట్టుకునేవాడు. తానే ఏయే అంశాల్లో వెనుకబడ్డాడో గుర్తించి తిరిగి ప్రిపరేషన్ ప్రారంభించేవాడు. మొదటి సారి 2019లో సివిల్స్ రాసి మెయిన్స్కు అర్హత సాధించాడు. కానీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాడు.
తర్వాత 2020, 2021 ఇలాగే జరిగింది. అయినా సాయికృష్ణ కుంగిపోలేదు. రెట్టింపు కసితో చదివాడు. 2022లో సివిల్స్ ఐప్లె చేశాడు. మే నెలలో ప్రిలిమ్స్ రాసి 200కి 120 మార్కులు సాధించి మెయిన్స్కు అర్హత సాధించాడు. ఇదే ఏడాది అక్టోబర్లో మెయిన్స్ రాసి క్లియర్ చేసి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయి చివరకు సివిల్స్ సాధించాడు. ఏకంగా 293వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. సాయికృష్ణను మంగళవారం కొత్తగూడేనికి చెందిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెల్లోషిప్ సంస్థ ప్రతినిధులు సన్మానించారు. పలువురు అభినందించారు.
సత్యసాయి మనోజ్కు 559 ర్యాంక్
కొణిజర్ల, మే 23: యూపీఎస్సీ మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో అనంతారం గ్రామానికి వినుకొండ ఈశ్వర సత్యసాయి మనోజ్ 559వ ర్యాంకు సాధించాడు. గతేడాది సివిల్స్ ఫలితాల్లో 615వ ర్యాంక్ సాధించిన సత్యసాయిమనోజ్ ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కం ట్యాక్స్ ఆఫీసర్గా శిక్షణ పొందుతున్నాడు. ఈ ఏడాది మరోసారి సివిల్స్ రాసి మరో అడుగు ముందుకేసి 559వ ర్యాంకు సాధించాడు. తండ్రి వెంకటేశ్వర్లు పోలీస్ డిపార్ట్మెంట్లో డీఎస్పీగా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం వారి కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. సత్యసాయి మనోజ్ సివిల్స్లో ఉత్తమ ర్యాంక్ సాధించినందుకు అనంతారం గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
సివిల్స్ సాధించడం నా జీవితాశయం. వరుసగా మూడుసార్లు ఫెయిల్ అయినప్పటికీ ఆశ వదులుకోలేదు. నిరాశ పడలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారంతో చదివాను. నాలుగోసారి ఇంటర్వ్యూకు సెలక్ట్ అయి సక్సెస్ అయ్యాను. సివిల్స్ కోసం నేను నెలకు రూ.50 వేల జీతం వచ్చే కొలువును వదిలేశాను. అందుకు తగిన ప్రతిఫలం దక్కింది. నా కల నెరవేరింది.
– సాయికృష్ణ, యూపీఎస్సీ 293 ర్యాంకర్