ఖమ్మం, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మిగ్జాం తుపాను రైతుల్లో గుబులు పుట్టించింది. రెండు రోజులుగా తుంపర్ల నుంచి ఈదురు గాలులతో మోస్తరు వర్షంగా మారి అన్నదాతను కోలుకోకుండా చేసింది. కోతకొచ్చిన వరి పనలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. కల్లాలు, రోడ్ల వెంట, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణమైంది. టార్పాలిన్లు, పరదాలు కప్పినా కింది నుంచి ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. చేలల్లో చెట్లపై ఉన్న మిరప కాయలు, పత్తి పంట నానిపోయాయి. మొక్కజొన్న, వేరుశనగ, ఆయిల్పాం, అరటి, చెరకు తోటలు, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆరుగాలం శ్రమించి కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు కళ్లముందే వర్షంలో నీటి పాలవుతుంటే రైతుల గుండెలు అవిసిపోతున్నాయి. కొన్నిచోట్ల పూరిళ్లు కూలిపోయాయి.
విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో సగటున 99.2 మి.మీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి జిల్లాలో సగటున 11 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రెండు జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆల క్షేత్రస్థాయికి వెళ్లి వరద పరిస్థితిని అంచనా వేయడంతోపాటు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వర్షం పరిస్థితిని అంచనా వేస్తూ సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు చేశారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు.
మిగ్జాం తుపాన్ రెండు రోజులుగా ఉభయజిల్లాలను ముసురుకున్నది. చేతికొచ్చిన పంటలను ముంచెత్తింది. రైతులకు తీరని నష్టాన్ని మిగిలించింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి బుధవారం ఉదయం వరకు ఖమ్మం జిల్లాలోని 21 మండలాల పరిధిలో సగటున 6 సెం.మీకు పైగా వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సత్తుపల్లి మండలంలోని చెరువు బేతుపల్లి చెరువుతో పాటు కొన్ని చెరువులు అలుగు పోశాయి. అత్యధిక వర్షపాతం సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో నమోదైంది. పలు చోట్ల కల్లాల్లో ఉంచిన ధాన్యం తడిసి మద్దయింది. మరికొన్నిచోట్ల పత్తి, మిర్చి తోటలు దెబ్బతిన్నాయి. వరి పనలు నేలకొరిగాయి. ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో పంట నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో కలెక్టర్ వీపీ గౌతమ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం.విజయనిర్మల పర్యటించారు. పంట నష్టంపై నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 82,000 ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో గోడ కూలి దంపతులు నూకతోటి పుల్లారావు, లక్ష్మి మృతిచెందారు.
జిల్లావ్యాప్తంగా వర్షపాతం వివరాలు ఇలా..
మంగళవారం తెల్లవారుజాము నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో సగటున 99.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సత్తుపల్లి మండలంలో 158.2 మి.మీ, వేంసూరులో 155.4 మి.మీ, ఎర్రుపాలెం 146.2 మి.మీ, మధిర 144.2 మి.మీ, ఏన్కూర్ 140 మి.మీ, కల్లూరు 136.2 మి.మీ, పెనుబల్లి 126.2 మి.మీ, బోనకల్ 128.6 మి.మీ, వైరా 115 మి.మీ, తల్లాడ 99 మి.మీ, కొణిజర్ల 90 మి.మీ, ఖమ్మం రూరల్ 71.8 మి.మీ, సింగరేణి 75.4 మి.మీ, కామేపల్లి 61.8 మి.మీ, రఘునాథపాలెం 63.2 మి.మీ, తిరుమలాయపాలెం 55.6 మి.మీ, కూసుమంచి 60.4 మి.మీ, ముదిగొండ 67.8 మి.మీ, చింతకాని 68.4 మి.మీ, ఖమ్మం అర్బన్ 77.8 మి.మీ, నేలకొండపల్లి మండలంలో 42.6 మి.మీ వర్షపాతం నమోదైంది. దాదాపుగా అన్ని మండలాల్లో 6 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదు కావడం విశేషం.
వర్ష బీభత్సంపై ఆరా..
మిగ్జాం తుపాన్ ప్రభావంపై మధిర, పాలేరు, ఖమ్మం ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్కు స్వయంగా కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పంట నష్ట తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెస్క్యూ ఆపరేషన్కు అవసరమైన ఆధునిక బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలన్నారు. యంత్రాంగం దెబ్బ పంటను పరిశీలించేలా ఆదేశాలివ్వాలన్నారు.