చేసి ఇంటి యజమానులకు ఊరట కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం బిల్డింగ్ పర్మిషన్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ (టీఎస్-బీపాస్) విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇంటి యజమానులు కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే కేవలం 21రోజుల్లోనే సర్కార్ నిర్మాణాలకు గ్రీన్సిగ్నల్ ఇస్తున్నది. దీనిలో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 238 మంది దరఖాస్తు చేసుకోగా 188, పాల్వంచలో 311 దరఖాస్తులకు 279, ఇల్లెందులో 102 దరఖాస్తులకు 10 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. ఈ ప్రక్రియ విజయవంతంగా అమలవుతున్నది.
కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 14 : భనవ నిర్మాణాల అనుమతులు సులభతరం చేసి ఇంటి యజమానులకు ఊరట కలిగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం బిల్డింగ్ పర్మిషన్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్(టీఎస్-బీపాస్) విధానాన్ని అమలులోకి తెసుకొచ్చింది. అన్ని ధ్రువపత్రాలు సక్రమంగా ఉంటే కేవలం 21రోజుల్లోనే అనుమతులు వచ్చేలా రూపకల్పన చేసింది. దీంతో భవన నిర్మాణం చేపట్టాలనుకునే వారికి కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది. అంతేకాకుండా కార్యాలయాల్లో అనుమతులకోసం ముడుపులు ఇచ్చే అవసరం లేకుండానే ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇస్తుండడంతో ఊరటనిచ్చినట్లయింది. మూడేళ్లుగా ఈ ప్రక్రియ విజయవంతంగా క్షేత్రస్థాయిలో అమలవుతోంది.
జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. మణుగూరు పూర్తిగా ఏజెన్సీ పరిధిలో ఉండడంతో అక్కడ మున్సిపాలిటీలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు లేవు. పాల్వంచలో రిజిస్ట్రేషన్ భూములు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో గతంలో 373జీవో, ప్రస్తుతం 76జీవో ప్రకారం, ఇల్లెందు మున్సిపాలిటీలో ఇటీవల 76జీవోను అమలు చేసి క్రమబద్ధీకరణ చేసి ఇంటి పట్టాలను యజమానులకు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో అనుమతులు తీసుకొని ఇంటి నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య పెరుగుతోంది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 238దరఖాస్తులు రాగా 188 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 20దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. పాల్వంచ పట్టణపరిధిలో 311 దరఖాస్తులు రాగా 279నిర్మాణాలకు అనుమతులు లభించాయి. 20 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలినవి పరిశీలన దశలో ఉన్నాయి. ఇల్లెందు మున్సిపాలిటీలో 102దరఖాస్తులు రాగా 10 నిర్మాణాలకు అనుమతులు లభించాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణంగా 92 దరఖాస్తులను తిరస్కరించారు.
నూతనంగా తీసుకువచ్చిన టీఎస్-బీపాస్ విధానంలో నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా విధించడం లేక భవన నిర్మాణాల యజమానులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి కూల్చివేసే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది.
సెల్ఫ్ సర్టిఫికేషన్(స్వీయ ధ్రువీకరణ) ఇచ్చిన వివరాలతో ఇంటిని నిర్మిస్తే యజమానులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అనుమతులు ఇచ్చిన తర్వాత మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఫైర్శాఖల అధికారులు ఎన్ఫోర్స్మెంట్ టీం రంగంలోకి దిగి వచ్చి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తారు. భవన నిర్మాణానికి అనుమతి తీసుకునే ముందు సమర్పించిన ధ్రువపత్రాలు, భవన నిర్మాణాల పరిధి వివరాలు సక్రమంగా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండబోవు.
ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్-బీపాస్ విధానాన్ని ఇంటి నిర్మాణ దారులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పురపాలక శాఖ పరిధిలో భవనాలను నిర్మించుకునేవారు మీ సేవా ద్వారా కానీ, సీనియట్ సిటిజెన్ సర్వీస్ సెంటర్లలో ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చు. 21రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నాం. ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
-తోటమళ్ల నవీన్కుమార్ (కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్)